ఓటర్లే నిజమైన విజేతలన్న కేంద్ర ఎన్నికల సంఘం

ఓటర్లే నిజమైన విజేతలన్న కేంద్ర ఎన్నికల సంఘం
దేశవ్యాప్తంగా పలు సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్య రథాన్ని ముందుకు నడుపుతున్న ఓటర్లే నిజమైన విజేతలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతించింది. ఏప్రిల్‌ 19న మొదటి దశ పోలింగ్‌తో ఏడు దశల్లో పోలింగ్‌ ప్రక్రియ శనివారం విజయవంతంగా ముగిసింది. 

ఈ నేపథ్యంలో ఓటర్లకు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు, ఇతర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం పూర్తి చిత్తశుద్ధితో ప్రజలకు కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేస్తోందని పేర్కొన్నారు. 

భారత ప్రజలంతా ఒకే గొంతుకై ప్రతిధ్వనించి ప్రజాస్వామ్య రథచక్రాలను ముందుకు నడుపుతూ 18వ సాధారణ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియకు ముగింపు పలికామని తెలిపారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన ఓటరు మహాశయులకు, రాజకీయ పక్షాలకు, పోలీసు సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. 

ప్రజాస్వామ్య రథాన్ని సమిష్టి కృషితో అవిరళంగా మున్ముందుకు నడవడంలో దేశ ప్రజానీకం భాగస్వాములమయ్యారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి పెద్దయెత్తున పోలింగ్‌ స్టేషన్లకు తరలివచ్చి ఓటు వేశారని తెలిపింది.