పల్నాడులో ఖాకీ యూనిఫాం అంటే ఏమిటో చూపిస్తా

పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలతో దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే పల్నాడు `అధ్వాన్నపు జిల్లా’ అనే ముద్ర పడిందని విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వనని ఆమె  స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, యూనిఫాం పవర్ ఏమిటో చూస్తారని ఆమె హెచ్చరించారు. తగినంతమంది పోలీసులు ఉన్నా ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయని, పల్నాడు పేరు చెడగొ ట్టారని, పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతటా ప్రచారమైందని ఆమె తెలిపారు. 
 
ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని వదిలి పెట్టమని గార్గ్ హెచ్చరించారు. మాచర్ల, నరసరావుపేటల్లో జరిగిన గొడవలతో దేశమంతటా మార్మోగాయని మలికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలతో ఇక్కడ ఏమి జరుగుతోందని దేశమంతటా గమనిస్తోందని, తన సహచరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పల్నాడు ఫ్యాక్షన్ గురించే అడుగుతున్నారని ఆమె చెప్పారు. 
 
పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదు చేశామని చెబుతూ ఇన్ని కేసులు నమోదు చేయాలని ఏ పోలీస్ అధికారి కోరుకోరని గార్గ్ పేర్కొన్నారు. పల్నాడు తర్వాత స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆమె చెప్పారు.  ఘర్షణల కేసుల్లో ఇప్పటి వరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400 మందిపై రౌడీషీట్లు తెరిచినట్టు ఎస్పీ ప్రకటించారు. 
 
పల్నాడు అల్లర్లలో నిందితుల్ని పెట్టేందుకు జైళ్లు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లు ఆమె చెప్పారు. గొడవల్లో జైళ్లకు వెళుతున్న వారంతా సామాన్యులేనని, నాయకులు మాత్రం డబ్బు, తెలివి తేటలతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు తెలియచెప్పారు. గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలేనని చెబుతూ నాయకుల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దని ఆమె సూచించారు. 
 
కాగా, మాచర్ల ఎన్నికల పోలింగ్‌ ఘర్షణల నేపథ్యంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ మల్లికా గార్గ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిలను మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని  కోరుతూ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న మాచెర్ల వైసిపి ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.