1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం

1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం
సుమారు 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు వివరణ ఇచ్చారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో సుమారు 1,200 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ(సస్పెండెండ్) ప్రణీత్రావు వాంగ్మూలంలో వెల్లడించారు.  ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నామని చెప్పారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశామని తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వాంగ్మూలంలో ప్రణీత్రావు పేర్కొన్నారు. 

56 మంది ఎస్వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు.  ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుండి ఫోన్ ట్యాపింగ్‌ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారని తెలిపారు.  ఆయన ఆదేశాలతో 50కొత్త హార్డ్ డిస్క్ లను తీసుకువచ్చి, పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లను ఫిక్స్ చేశామని వెల్లడించారు.

17హార్ట్ డిస్క్ లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామని,  సిడిఆర్ తో ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామని చెప్పారు. ల్యాప్ ట్యాప్ లు, పెన్ డ్రైవ్ లు, హార్ట్ డిస్క్ లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, తదితరాలను నాగోల్, ముసరాంబాగ్ సమీపంలోని మూసీనదిలో పారేశాం అని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫార్మేట్ చేసిన ఫోన్లు, పెన్డ్రైవ్లను బేగంపేట నాలాలో పడేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్రావు వెల్లడించారు.

కాగా, ఈ కేసులో కీలక నిందితుడైన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు వాంగ్మూలంలో రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా జడ్జీలు, జర్నలిస్టులు ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు, డీఎస్పీ ప్రణీత్రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని వాంగ్మూలంలో భుజంగరావు తెలిపారు. 2018 శాసనసభ ఎన్నికల ముందు నుంచే ఫోన్లను ట్యాపింగ్ చేయడం ప్రారంభించామని చెప్పారు.