టి20 ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో సూర్యాకుమార్ యాదవ్

టి20 ర్యాంకింగ్స్‌  అగ్రస్థానంలో సూర్యాకుమార్ యాదవ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ 861 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.  ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్) రెండో స్థానం, మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. మార్‌క్రమ్ (సౌతాఫ్రికా) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

భారత యువ సంచనలం యశస్వి జైస్వాల్ ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌లో నిలిచాడు. రవిబిష్ణోయ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.  ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్య ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న టీమ్ సభ్యులు.. అక్కడే టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్స్ అందుకోవడం విశేషం. ఇక వివిధ కేటగిరీల్లో ఐసీసీ అవార్డులు గెలుచుకున్న వాళ్లకు కూడా ఈ సందర్భంగానే వాటిని అందజేశారు.

టీ20 క్రికెట్ లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించారు. దీంతోపాటు అతనికి టీ20 టీమ్ అఫ్ ది ఇయర్ క్యాప్ కూడా దక్కింది. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ అందజేశారు. ఈ ఇద్దరూ ఐసీసీ అనౌన్స్ చేసిన ఆయా టీమ్స్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఐసీసీ వన్డే అఫ్ ది ఇయర్ లో చోటు దక్కించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లకు ఆ క్యాప్స్ అందించారు. లెఫ్టామ్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ దక్కించుకున్నాడు.  టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా తన తొలి మూడు లీగ్ మ్యాచ్ లను న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసౌ క్రికెట్ స్టేడియంలోనే ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. 

ఇక జూన్ 9న మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ గా భావించే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జూన్ 12న యూఎస్ఏ, జూన్ 15 కెనడాతో ఆడాల్సి ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్.. ఇప్పటి వరకూ మళ్లీ ఈ మెగా టోర్నీ గెలవలేకపోయింది.

చివరిసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీలో ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా గెలవలేకపోయింది. చివరిసారి 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడింది. ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. రోహిత్, కోహ్లిలాంటి సీనియర్లకు కప్పు గెలవడానికి ఇదే చివరి అవకాశం కూడా కావచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024కు ఇండియన్ టీమ్

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్