
ఈ లోక్సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై తూటాలకు దింపిన వారికి మధ్య పోటీగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్నికల ప్రచారదశల్లో అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని ఎన్నికల సంఘం హెచ్చరికలు వెలువరించిన తరువాత హోం మంత్రి ఉత్తరప్రదేశ్లో బుధవారం నాటి ఎన్నికల సభలలో మాట్లాడారు.
ఇవి మామూలు ఎన్నికలు కావని, అయోధ్యలో రామాలయనిర్మాణానికి పాటుపడ్డ వారు ఒక వైపు, వారిపై కాల్పులకు ప్రేరేపించిన వారొక్కరు బరిలో నిలిచారని చెప్పారు. డియోరియాలో బిజెపి అభ్యర్థి శశాంత్ మణి త్రిపాఠీ విజయానికి అమిత్ షా బిజెపి తరఫున ప్రచారం సాగించారు. విపక్షాలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 70 ఏండ్ల పాటు అడ్డుగా మారారని తెలిపారు. ప్రధాని మోదీ ప్రమేయంతోనే అయోధ్యలో రామాలయం ఉనికిలోకి వచ్చిందని స్పష్టం చేశారు.
1990లో ములాయం సింగ్ యాదవ్ సిఎంగా ఉన్నప్పుడు కరసేవకులపై కాల్పుల విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన అమిత్ షా సమాజ్వాది పార్టీ ప్రమాదకరమైనదని హెచ్చరించారు. కాంగ్రెస్కు, సమాజ్వాది పార్టీ నేతలకు వారిపై వారికే నమ్మకం లేదని, ఎన్నికలలో ఓటమి పాలయినప్పుడల్లా వారు ఇవిఎంలపై నిందలు మోపడం జరుగుతుందని విమర్శించారు.
ఇప్పుడు జూన్ 4వ తేదీన కూడా ఇదే జరుగుందని పేర్కొంటూ ఆ రోజు ఇద్దరు యువరాజులు (రాహుల్, అఖిలేష్ యాదవ్) కూడబలుక్కుని విలేకరుల సమావేశం పెడుతారుని, తమ ఓటమికి కారణం ఏవిఎంలే అని మరోసారి నిందిస్తారని ఎద్దేవా చేశారు. ఆ రోజు జరిగేది ఇదే అని అంతకు ముందు మహారాజ్గంజ్లో పార్టీ అభ్యర్థి పంకజ్ చౌదరి విజయానికి జరిగిన సభలో చమత్కరించారు.
ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ 40 స్థానాలు కూడా గెలుచుకోలేదని, అలాగే అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజవాదీ పార్టీ 4 స్థానాలు గెలుచుకుంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీయే యూపీలోని 80 స్థానాలలో 70 గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేరని, వారికి ఐదేళ్లలో ఐదుగురు ప్రధాను ఉంటారని వ్యాఖ్యానించారు. ఇదేమన్నా కిరాణాకొట్టా? 130 కోట్ల మందితో కూడిన దేశం, బహుళ ప్రధానుల పద్ధతి చెల్లనేరుతుందా? వారి పరాజయం తప్పదు, ఇవిఎంలపై నిందలూ తప్పవని స్పష్టం చేశారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్