గత రెండు రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు, హోమాలకు ప్రతిఫలం అన్నట్లు వడగళ్ల వానతో వరుణుడు కుండపోత కురిపించారు. భక్తులు ఆ తన్మయత్వంలోనే మూడోరోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు. ఇవాళ ఉదయం కుంభారాధనం అనంతరం వుక్తహోమం నిర్వహించి హనుమంతుడిపై కోదండధారిగా వెంకటేశ్వరుడు మాఢవీధుల్లో ఊరేగేతూ భక్తులను కనువిందు చేశారు.
భారతీయ నేపథ్యం కలిగిన బెంగాలీ, మలయాళీ, తమిళ, తెలుగు, మరాఠి ప్రవాస కుటుంబాలకు చెందిన స్థానిక చిన్నారులు పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. మధ్యాహ్నం ప్రముఖ నాట్యాచార్యుడు డా.కళాకృష్ణను ఆలయ కార్యవర్గం సన్మానించింది. పలువురు స్థానిక నాట్యచార్యుల శిష్యులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు.
ఆదివారం సాయంత్రం హోమం సమయంలో ఒకసారిగా వడగళ్లతో కుండపోత వాన కురిసింది. అయినప్పటికీ నిర్వాహకులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా హోమాన్ని కొనసాగించారు. అనంతరం సహస్రదీపాలంకార ఊంజల్ సేవ, గరుడ వాహన సేవలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తమ భక్తి ప్రపత్తులు వరుణుడిని అనుకున్న దానికన్న ఎక్కువగా మెప్పించారని ఆలయ ఛైర్మన్ రజనీకాంత్ గంగవరపు పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళి ఏర్పాట్లను సమన్వయపరిచారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

More Stories
ట్రంప్కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు