ఇరాన్ అధ్యక్షుడు హత్యకు గురయ్యారా? 

ఇరాన్ అధ్యక్షుడు హత్యకు గురయ్యారా? 

*ఇజ్రాయిల్ పై అనుమానాలు!

ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని పర్వత ప్రాతంలో ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీని హత్య చేసి ఉంటారని పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ బద్ధ శత్రువు ఇజ్రాయెల్ హస్తం ఇందులో ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.  ఈ హత్యలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉండేందుకు అవకాశం లేకపోలేదని ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదని యూరోపియన్ పార్లమెంట్ మాజీ సభ్యుడు నిక్ గ్రిఫిన్ వ్యాఖ్యానించారు. గాజా/హిజ్బుల్లా/ఇరాన్/ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వెనుక కారణాలు మొస్సాద్‌కు తెలుసునని ఆయన పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్, అజర్‌బైజాన్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ, అజర్‌బైజాన్ అధ్యక్షుడు కలసి ఖీజ్ ఖలాసీ హైడ్రో విద్యుత్ డ్యాంను తమ సరిహద్దుల్లో ప్రారంభించారని, ఇది తమ రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి, మైత్రీ బంధానికి చిహ్నంగా నిలుస్తుందని వారు కీర్తించారని గ్రిఫిన్ ఎక్స్ వేదికగా గుర్తు చేశారు.

ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం వల్ల అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. నాగర్నో-కరాబఖ్‌లో ఆర్మేనియా సేనలను అడ్డుకోవడానికి డ్రోన్లు, ఇతర ఆయుధాలు అమ్మి ఇజ్రాయెల్ భారీగా లాభాలు ఆర్జిస్తోందని, ఆర్మేనియన్లకు ఇరాన్ అండగా నిలబడిందని గ్రిఫిన్ వివరించారు. యుద్ధం కొనసాగడంతో ఇజ్రాయెలీ ఆయుధాల పరిశ్రమకు లాభాలు లభిస్తాయని ఆయన చెప్పారు. 

కాగా..ఇబ్రహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడాన్ని హత్యగా ఒక సోషల్ మీడియా యూజర్ అనుమానించాడు. దీని వెనుక ఇజ్రాయెల్ ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇరాన్ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాలతో ఇరాన్ పరోక్ష యుద్ధం వెనుక రైసీ ప్రధాన వ్యూహకర్తని మరో యూజర్ పేర్కొన్నాడు. 

అసమ్మతిని నిర్దాక్షిణ్యంగా అణచివేసిన రైసీ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చిత్రహింసలు పెట్టి చంపివేశారని ఆయన ఆరోపించారు. రైసీకి అంతర్గతంగా శత్రువులు ఉండే అవకాశం ఉందని, వారే ఈ హత్యకు కుట్ర పన్ని ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిల ఉండగా ఇరనా అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అది తమ పని కాదని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఉండే అవకాశం లేకపోలేదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

 డామాస్కస్‌లోని ఇరాన్ సైనిక జనరల్ మొహమ్మద్ రేజా జహేదీని ఇజ్రాయెల్ హత్య చేసిన దరిమిలా గత నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. గత కొన్ని సంవత్సరాలు ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ అనేక దాడులు జరిపిన ఉదంతాలు ఉన్నాయి.