జెల్ తో రొమ్ము క్యాన్సర్‌ చికిత్స

జెల్ తో రొమ్ము క్యాన్సర్‌ చికిత్స
మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని శరీరానికి అవతల ఏకంగా వారంపాటు భద్రపరిచే కొత్త జెల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ పరిశోధకులు వెల్లడించారు. 
 
రొమ్ము క్యాన్సర్‌ పరిశోధనలకు, క్యాన్సర్‌ చికిత్సకు ఈ సాంకేతికత ఓ గేమ్‌ఛేంజర్‌ అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.  సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌కు గురైన మహిళలకు చికిత్సలో భాగంగా కొన్ని మందులను ఇస్తారు. అయితే, జన్యుక్రమాన్ని బట్టి ఈ మందులు కొందరికి పనిచేయవచ్చు. మరికొందరికి పనిచేయకపోవచ్చు. 
 
దీంతో వేరే డ్రగ్స్‌ వాడటానికి సమయం మించిపోవడంతో బాధితులు మరణించేవారు. అయితే, తాజా జెల్‌ సొల్యూషన్‌లో క్యాన్సర్‌కు గురైన మహిళ రొమ్ము కణజాలాన్ని వారంపాటు భద్రపర్చవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ సమయంలో క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా ఏ డ్రగ్‌ సమర్థంగా పనిచేస్తుందో జెల్‌లో ఉంచిన కణజాలానికి ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 

ఒకవేళ ఆ మందులు సమర్థంగా పనిచేస్తే వాటినే బాధితులకు ఇచ్చినైట్లెతే, క్యాన్సర్‌ను నయంచేయడంతో పాటు మరణాలను కూడా తగ్గించవచ్చని తెలిపారు. ఈ వివరాలు ‘నియోప్లాసియా’, ‘మామరీ గ్లాండ్‌ బయాలజీ’ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారిలో రొమ్ము క్యాన్సరే ప్రధానమైంది. ప్రపంచంలోని 157 దేశాల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఒక్కఏడాదే ఈ క్యాన్సర్‌తో 6,70,000 మంది మరణించారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.