చెప్పుల వ్యాపారుల ఇళ్లలో రూ.100 కోట్ల నోట్ల కట్టలు 

చెప్పుల వ్యాపారుల ఇళ్లలో రూ.100 కోట్ల నోట్ల కట్టలు 
ఉత్తర్​ప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన తనిఖీలు సంచలనంగా మారాయి. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏమూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. ఆ డబ్బు లెక్కపెట్టలేక యంత్రాలే ఆగిపోయాయి. ఆ డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సుమారు 42 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లలోని మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో కూడా 500 రూపాయల నోట్ల కట్టలు కోట్లల్లో లభ్యమయ్యాయి. 
 
డబ్బుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. ఈ అక్రమాస్తులు లెక్క ఇప్పటి వరకు రూ.100 కోట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి.

ఆదాయపు పన్ను దర్యాప్తు బృందం శనివారం ఉదయం 11 గంటలకు ఆగ్రాలోని 14 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎమ్​జీ రోడ్‌కు చెందిన బీకే షూస్, ధాక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్, ఆసఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. 

ఈ తనిఖీల్లో ఆగ్రా, లఖ్‌నవూ, కాన్పూర్, నోయిడాకు చెందిన అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఉన్నారు. హర్మిలాప్ ట్రేడర్స్ యజమాని రామ్‌నాథ్ డంగ్‌కు చెందిన జయపురలోని హౌస్‌లో మంచాలు, పరుపులు, అల్మారాలు, షూ బాక్స్‌లు, బ్యాగులు, గోడల్లో రూ.500ల నోట్ల కట్టలను ఐటీ బృందం గుర్తించింది. 

రెండు రోజుల క్రితం సోదాలు ప్రారంభమవ్వగా, ఇప్పటికీ ఈ నగదును లెక్కిస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మంచంపై రూ. 500 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. గోవింద్ నగర్‌లోని రామ్‌నాథ్​డాంగ్ నివాసంలో కూడా భారీగా నగదు పట్టుబడింది. ప్రత్యేక బృందాలు, డబ్బుల లెక్కింపులో నిమగ్నమై ఉన్నాయి.

వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడం వల్ల ఇతర యంత్రాలను తెప్పించారు.  కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.