రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ  ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన గదులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమీషనర్ డా. రవిశంకర్ అయ్యనార్ లతో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు మీనా సూచించారు. విశాఖపట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. 
తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సునిశితంగా పరిశీలించారు. 
అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేశారు.  మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు.
 కాగా, ఈవీఎంల భద్రతపై జిల్లా ఎన్నికల అధికారి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, నగర పోలీస్ కమిషనర్తోపాటు పోటీలో అభ్యర్థులు లేదా వారి తరపున జనరల్ ఏజెంట్లు ప్రతిరోజు తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు, రాత్రి పది గంటల సమయంలో ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గది వద్దకు వెళ్లి తాళాలు, దానిపై వేసిన సీల్ను పరిశీలించుకోవచ్చు. 
పర్యటనలో భాగంగా అక్కడి పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన చర్యలను సీఈవోకు కలెక్టర్, పోలీసు కమిషనర్ వివరించారు. విశాఖ నుంచి ఎన్నికల అధికారి శ్రీకాకుళం వెళ్ళారు. రేపు విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.
                            
                        
	                    
More Stories
ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి సారించాలి
మాజీ మంత్రి జోగి రమేశ్కు 13 వరకు రిమాండ్