కేంద్రంలో పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం

కేంద్రంలో పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ కేంద్రంలో గత పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టే బాంబును అడుక్కునే చిప్పలో వేసి పాకిస్థాన్‌ చేతిలో పెట్టామని ప్రధాని ఎద్దేవా చేశారు.
 
”దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువులు మనపై ఏది చేయడానికైనా ముందు 100 సార్లు ఆలోచిస్తారు. పాకిస్థాన్ 70 ఏళ్ల నుంచి భారతదేశానికి ఇక్కట్లపాలు చేస్తోంది. వాళ్లకు చేతిలో బాంబులు ఉన్నాయి. ఇవాళ వాళ్ల చేతుల్లో భిక్షాపాత్ర ఉంది. బలమైన ప్రభుత్వం అనేది ఉంటే శత్రువులు వణుకుతారు” అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘పాకిస్థాన్‌ దగ్గర ఆటం బాంబు ఉన్నది జాగ్రత్త’ అని కాంగ్రెస్‌ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోదీ పైవిధంగా స్పందించారు. తాను మణిశంకర్‌ మాట్లాడిన ఒక వీడియోను ఫోన్‌లో చూశానని, అందులో ఆయన ‘భారత్‌.. పాకిస్థాన్‌ను గౌరవించి తీరాలి. ఎందుకంటే పాకిస్థాన్‌ దగ్గర ఆటం బాంబు ఉంది’ అని వ్యాఖ్యానించారని మోదీ చెప్పారు. 

ఇండియా కూటమికి చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ప్రధాని గుర్తుచేశారు. కానీ గత పదేళ్లుగా కేంద్రంలోని బలమైన ప్రభుత్వం పాకిస్థాన్‌ను కట్టడి చేసిందని, వారి దగ్గరున్న బాంబును అడుక్కునే పాత్రలో వేసి వాళ్ల చేతిలోనే పెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏదైనా చేయాలనుకుంటే ఒకటి వందసార్లు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు.  జమ్మూకశ్మీర్‌ను ప్రస్తావిస్తూ, అక్కడి పరిస్థితిని బలహీన ప్రభుత్వం ఉంటే మార్చగలదా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే హర్యానాలోని వీరమాతలు రేయింబవళ్లు ఆందోళనతో ఉండేవారనీ, ఈరోజు పదేళ్లుగా అవన్నీ ఆగిపోయాయని చెప్పారు. బలమైన మోదీ ప్రభుత్వం 370వ అధికరణ అనే గోడను కూల్చేసిందని, కశ్మీర్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతిమయం,  మోసాలతో కూడుకున్నదేనని మోదీ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ మొదటి కుంభకోణమే సైనిక సాయుధ బలగాలకు సంబంధించింది. అధికారంలో కొనసాగడానికి కొత్త స్కాములతో ఆ పార్టీ తన ట్రాక్ రికార్డును కొనసాగించింది. బోఫోర్స్ స్కామ్, సబ్ మెరైన్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్ వంటివి జరిగాయి” అని గుర్తు చేశారు. 

భారత దేశం బలహీనంగా ఉండడానికి కాంగ్రెస్ సాయుధ బలగాలను బలహీనంగా ఉంచిందని ప్రధాని ధ్వజమెత్తారు. ఆయుధాల దిగుమతుల పేరిట డబ్బు సంపాదించుకుందని, జవానులకు ఏమి కావాలో కూడా వారు లెక్కలోకి తీసుకోలేదని మోదీ ఆరోపించారు.

“దేశంలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల సమయమే ఉంది.  జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి గెలుస్తుంది. జూన్ 4కు ఇంకా కేవలం 17 రోజులే ఉన్నాయి. కాంగ్రెస్ దాని ఇండీ అలయెన్స్ పార్టీలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని పేర్కొన్నారు.