కేజ్రీవాల్ ప్రసంగంపై ఈడీ అభ్యంతరం

కేజ్రీవాల్ ప్రసంగంపై ఈడీ అభ్యంతరం

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గెలిస్తే జూన్‌ 2వ తేదీన తిరిగి తాను జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అయితే అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రసంగంపై ఇడి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఇడి పిటిషన్ దాఖలు చేసింది. 

ఇడి తరపున  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై ‘అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం.. దీనిపై మేం ఏమీ చెప్పలేం’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసి, ఆయన్ని జైలు పంపాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

కాగా, కేజ్రీవాల్‌ ఎప్పుడు కోర్టులో లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చట్టపాలన ఆధారంగానే ఉంటుందని, తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని, అదంతా కేజ్రీవాల్‌ ఊహేనని, ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను అభిషేక్‌ మను సింఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.