పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ మూకలు

పలుచోట్ల  దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ మూకలు
ఆంధ్రప్రదేశ్​లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుండగా, పలుచోట్ల వైఎస్సార్సీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాడులు, కిడ్నాప్​లో రెచ్చిపోతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఏడుగురు పోలింగ్‌ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తుకెళ్లారు. 

బిజెపి ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు కిడ్నాప్‌ అయ్యారు. మరో స్వతంత్ర అభ్యర్థికి చెందిన పోలింగ్‌ ఏజెంట్లను సైతం కిడ్నాప్‌ చేశారు. పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్‌ చేశారు. సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో  కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర కిడ్నాప్‌ ఉన్నారు. 

అదే విధంగా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఫిర్యాదు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మూకల దాడిలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దౌర్జన్యాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని చెప్పింది. పల్నాడు ప్రాంతానికి ప్రత్యేక అబ్జర్వర్‌ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించలేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతోనే అనుమతించడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలింగ్‌ కేంద్రంలోకి రావడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్లలో గందరగోళం నెలకొంది. టీడీపీ నేత రెడ్యా నాయక్‌పై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఆ క్రమంలో ఆయన కారు ధ్వంసం చేసి నానా రచ్చ సృష్టించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మార్కాపురం పట్టణంలోని 66వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. లింగసముద్రం మండలం, వాకములవారిపాలెం పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమై వెంటనే వాటిలోని సమస్యను పరిష్కరించేందుకు టెక్నిషన్స్‌ ను రంగంలోకి దించారు