ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్‌ పిఎ దాడి!

ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్‌ పిఎ దాడి!

మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆమ్‌ఆద్మీపార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ, దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతీ మాలీవాల్‌ సోమవారం ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారంటూ ఆమె చెప్పుకొచ్చినట్లు సమాచారం.

వారం రోజులు విదేశాల్లో ఉన్న ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అయితే కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అడ్డుకోవడంతోపాటు తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆమె నుంచి రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ముఖ్యమంత్రి నివాసం నుంచి  సోమవారం ఉదయం 9.40 గంటలకు 100కు మొదటి ఫోన్‌ కాల్‌ను ఒక మహిళ చేసిందని అయితే తన పేరును ఆమె ప్రస్తావించలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఉదయం 9.54 గంటల సమయంలో రెండో ఫోన్‌ కాల్‌ వచ్చినప్పడు తన పేరు స్వాతి మలివాల్ అని, ఢిల్లీ సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ విషయం విని  కేజ్రీవాల్‌ నివాసం వద్దకు మూడు వ్యాన్లు చేరుకున్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే అక్కడ స్వాతి మలివాల్‌ కనిపించలేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు సీఎం నివాసంలోకి ప్రవేశించలేరని చెప్పారు. అయితే అక్కడ ఆమె కనిపించలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత స్టేషన్‌కు వచ్చిన ఆమె, తర్వాత ఫిర్యాదు ఇస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. 

సీఎం హౌస్ వద్ద తనపై దాడి జరిగినట్టు సివిల్ లైన్స్‌ పీఎస్‌కు ఒక మహిళ నుంచి కాల్ వచ్చిందని, ఆ తర్వాత కొద్దిసేపటికి ఎంపీ మేడం (స్వాతి మలివాల్) పోలీస్ స్టేషన్‌కు వచ్చారని డీసీపీ (నార్త్) మనోజ్ మీనా తెలిపారు. తర్వాత ఫిర్యాదు ఇస్తానంటూ ఆమె వెంటనే వెళ్లిపోయినట్టు తెలిపారు. కాగా, లాంఛనంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఉదయం 10 గంటల ప్రాంతంలో తమకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, స్వాతీ మాలీవాల్‌పై దాడి వార్తలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఢిల్లీసీఎం సహాయకుడు స్వాతీ మాలీవాల్‌పై దాడి చేశారని ఐటీ సెల్‌ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి పోలీసులకు కాల్‌ వెళ్లిందని, కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతీ మాలీవాల్ ఎందుకు మౌనం వహించారో గుర్తుకువస్తుందా? అని పేర్కొన్నారు. 

కేజ్రీవాల్ అరెస్టు సమయంలో ఆమె భారత్‌లో లేరన్న అమిత్ మాలవీయ, చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదని గుర్తుచేశారు.అయితే ఇటీవల కాలంలో బిభవ్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఆయన నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సీఎం వ్యక్తిగత కార్యదర్శి హోదా నుంచి దిల్లీ విజిలెన్స్ విభాగం కుమార్‌ను తొలగించారు. అలాగే మద్యం కుంభకోణం కేసులోను ఈడీ ఆయనకు సమన్లు కూడా ఇచ్చింది.