తెలంగాణాలో 144వ సెక్షన్.. నిర్భయంగా ఓటేయండి

తెలంగాణాలో 144వ సెక్షన్.. నిర్భయంగా ఓటేయండి
తెలంగాణాలో సోమవారం పోలింగ్ జరుగనున్న దృష్ట్యా రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చిందని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయవచ్చని  తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​ భరోసా ఇచ్చారు. పోలింగ్ దగ్గర పడడంతో నిఘా మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 3.32కోట్ల మంది ఓటుహక్కు ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
 
ఆదివారం ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ బృందాలు బయలుదేరి వెళ్తాయని తెలిపారు. 13న ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభమవుతుందని, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో 10,12,14 మంది ఓటర్లు ఉండగా, 13 పోలింగ్‌ కేంద్రాల్లో 25 మందిలోపు ఓటర్లు, 23 పోలింగ్‌ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు ఉన్నారని వివరించారు.

9,900 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని , శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 12వేలమంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నట్లు వివరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ పూర్తవుతుందని చెప్పారు. 

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.320కోట్ల నగదు, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీలకు సంబంధించి 8వేలకుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, ఎన్నికల సంబంధించి బల్క్ ఎస్‌ఎంఎస్‌లను ప్రదర్శించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.1.90లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటారని.. 161 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలతో మొత్తం 70వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు.

‘బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయి. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొందరు పోలీసులు వస్తారు. కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులు బందోబస్తులో ఉంటారు. పోలింగ్‌ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తున్నాం. దాదాపు 20 వేల బ్యాలెట్‌ యూనిట్లు స్పేర్‌గా ఉంచుతాం.’ అని వికాస్​ రాజ్ తెలిపారు.