ఏపీలో పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ రోజు ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమీక్షించిన సీఈఓ పోలింగ్ ముందు చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు ముగియనున్నట్టు సీఈఓ తెలిపారు.
169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు, అరకు పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని స్పష్టం చేశారు. 13 తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి రాష్ట్రంలో సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందని వెల్లడించారు. 
 
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమలు అవుతుందని వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రచారం ముగింపుతో పాటు లౌడ్ స్పీకర్లకూ ఆనుమతి లేదని సీఈఓ వెల్లడించారు. డ్రైడే కాలాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉచితాలు, నగదు పంపిణీపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రచారాలు ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నేతలు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
 
పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటరు పేరు, సీరియల్ నెంబరు ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ మూడు వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూత్‌లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదని తెలిపారు.
కాగా, ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు వేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు.