
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది.
కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్పోల్ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు.
ప్రభాకర్ రావుతో పాటు మరో నిందుతుడు శ్రవణ్ కుమార్కు నాంపల్లి కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్తో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్కు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నారు.
అంతే కాకుండా ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని కోర్టుకు తెలిపారు. వాళ్లు చేసిన ఈ కుట్ర వ్యక్తిగత భద్రతతో పాటు రాష్ట్ర భద్రతకు కూడా తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్టు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సహా కోర్టులో తమ వాదనలను వినిపించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు తొలిసారిగా రెండు రోజుల క్రితం స్పందించారు. రెడ్కార్నర్ నోటీసు జారీపై కోర్టులో అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలోనే పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. తాను చేసే పనిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని వివరించారు.
మాజీ సీఎం కేసీఆర్ది తనది ఒకటే సామాజిక వర్గం అయినందునే తనను నిందిస్తున్నారని ప్రభాకర్ రావు వాపోయారు. నిజానికి తాను కూడా కేసీఆర్ బాధితుడినేనంటూ బాంబు పేల్చారు. తాను నల్గొండ ఎస్పీగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నాని జిల్లా నేతలు చెప్పటంతో తనను బదిలీ చేశారాని ఆరోపించారు. ఆ తర్వాత చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని, ఇంటెలిజెన్స్లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్ఐబీ ఛీప్గా నియమించారంటూ వివరించారు.
మరోవైప, ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదని, క్యాన్సర్ చికిత్స కోసం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్ రావు వివరించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతుందని, అమెరికా వెళ్లే ముందే భారత్ కు తిరుగు టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్ వస్తానని తెలిపిన ప్రభాకర్ రావు విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!