ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్

ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఈసీ నుంచి అనుమతి వచ్చి పది రోజులు గడిచినా ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. 
 
ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా పంపిణీ చేయలేకపోతున్నామని, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. స్పందించిన ఈసీ పరిహా రం పంపిణీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే పది రోజులు గడిచినా ప్రభుత్వం మాత్రం పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి రూ. 15.81 కోట్లు అవసరమవుతాయి.  ఈసీ అనుమతినిచ్చినా ఇంకా పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వం మొత్తం ఈ కొద్దిపాటి మొత్తం కూడా లేదా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పరిహారం పంపిణీ చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.