బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో 13కు చేరిన మృతుల సంఖ్య

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో 13కు చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్‌ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగాయి. ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. 
 
పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బీజాపూర్‌ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు గార్డ్స్‌(డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్‌, కోబ్రా, బస్తర్‌ ఫైటర్స్‌, ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) భద్రతా బలగాలు గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి.
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం కోర్‌చోలీ సమీపంలోని లెంద్రా అడవుల్లో తారసపడిన మావోయిస్టు దళాలు జవాన్లపై కాల్పులకు దిగాయి. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గ్రూపుల మధ్య దాదాపు రెండు గంటల పాటు తుపాకుల మోత మోగింది. 
 
ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిలో మొత్తం 1౩ మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీయెత్తున ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని ఐజీ పీ సుందర్‌రాజ్‌ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌లో డీవీసీ మెంబర్‌ క్రాంతి ముచతోపాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది.
 
మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడినట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 45 మంది నక్సలైట్లు మృతిచెందారు.
ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోలు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసి మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది.