దక్షిణ- ఉత్తర విభజన రాజకీయాల పట్ల జాగ్రత్త!

దక్షిణ- ఉత్తర విభజన రాజకీయాల పట్ల జాగ్రత్త!
భాష, ప్రాంతీయ వాదం పేరుతో దేశ సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని, దక్షిణ- ఉత్తర భారత్  పేరుతో విభజన కోసం జరుగుతున్న రాజకీయ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని  రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ హెచ్చరించారు.  విశాఖలోని భారత్‌ రైజింగ్‌ ఎలైట్‌ పేరిట జరుగుతున్న మేధావుల సదస్సులో  ముఖ్యఅతిధిగా పాల్గొంటూ బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటిని అడుగుతున్నారని చెబుతూ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ తాము అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. 
 
ఏపీలో బీజేపీకి గతం కంటే బిజెపి ఓటు బ్యాంక్‌ పెరిగిందని పేర్కొంటూ బీజేపీ ఏదో ఒక రోజు అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, అవినీతి అనే అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి అమ్మలాంటివి అని రాజ్‌నాధ్‌ సింగ్‌ ఆరోపించారు.  రాఫెల్‌ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే దేశీయ నైపుణ్యంతో అధ్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నామని తెలిపారు. 
 
కేవలం రాజకీయాల కోసమే భారతీయ జనతాపార్టీ లేదని, దేశాన్ని ప్రపంచ అగ్రస్ధానంలో నిలపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌, సివిల్‌ కామన్‌ కోడ్‌, అయెధ్య రామ మందిరం, ఆర్టిక్‌ 370 వంటి సాహసోపేత నిర్ణయాలు బీజేపీ అమలు చేసిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో భారత్‌ ప్రపంచ ఆర్ధిక శక్తిగా అవతరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు.
 
2027 నాటికి ప్రపంచ దేశాల్లోనే భారత్‌ మూడో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఐరోపా, అమెరికా వంటి దేశాలు సైతం ఆర్ధికలోటు విషయంలో ఇబ్బందులు పడుతుంటే మోదీ చొరవతో భారత్‌లో ఆర్ధికలోటును నియంత్రించగలిగామని చెప్పారు. స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజానాలే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ అన్ని పార్టీల కంటే భిన్నమైనదని, పేదరిక నిర్మూలన, మహిళల రక్షణ, సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి స్వయం సహాయ యోజన, ముద్ర రుణాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్ధికంగా ఎదుగుతున్నారని తెలిపారు. 

2014 ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కేవలం స్కామ్‌లు మాత్రమే ఉండేవని, మోదీ అధికారంలోకి వచ్చాక స్కీమ్‌లు అందుతున్నాయని ఆమె గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని, కేవలం లాభాల బాటలో పయనించే విధంగా కేంద్రం అడుగులు వేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఇక విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూమి కేటాయించకుండా ఆయా నెపాన్ని కేంద్రంపై నెట్టడం సరికాదని ఆమె ధ్వజమెత్తారు.

ఏపీ అభివృద్ధిని అగ్రగామిలో నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అవినీతికి తావులేని పాలన అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ఆమె కోరారు.  ఆంధ్రాలో ఒక్కసారి…. కేంద్రంలో మరోసారి కేంద్ర సర్కార్‌ పేరిట ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నట్లు ఆమె తెలిపారు.