
దక్షిణ మధ్య రైల్వే కరవడి – సూరారెడ్డిపాలెం మధ్య 20.3 కి.మీ.ల మేర మరో సెక్షన్ను విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్ విజయవాడ -గూడూరు ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టులలో ఇదీ ఒకటి కాగా ఈ రైలు మార్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది.
ఇప్పుడు ఈ మార్గాన్ని ట్రిప్లింగ్ చేయడంతో బాపట్ల – సూరారెడ్డిపాలెం మధ్య 81 కిలోమీటర్ల మేర నిరంతరాయంగా విద్యుదీకరణతో పాటు మూడో లైన్ సౌకర్యం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ -గూడూరు మధ్య గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్నఈ సెక్షన్, దేశంలోని ఉత్తర , తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్యాసింజర్ సరకు రవాణా రైళ్లలో స్థిరమైన పెరుగుదలతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ఈ కీలకమైన సెక్షన్లో రద్దీని తగ్గించేందుకు, విజయవాడ – గూడూరు మూడవ లైన్ ప్రాజెక్ట్ 2015 -16 సంవత్సరంలో 288 కి .మీల దూరానికి సుమారు రూ.3,246 కోట్లతో మంజూరు చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అన్ని విభాగాల్లో ఏకకాలంలో పనులు ప్రారంభించారు.
ఇప్పటి వరకు గూడూరు- సింగరాయకొండ మధ్య 127 కిలోమీటర్ల మేర బాపట్ల- కరవడి మధ్య 62 కి.మీ.ల మేర సెక్షన్లు పూర్తి చేసి విజయవంతంగా ప్రారంభించారు. ప్రస్తుతం విజయవాడ – గూడూరు మధ్యలో ఉన్న కరవడి – ఒంగోలు – సూరారెడ్డిపాలెం మధ్య 20 కి.మీల మేర సెక్షన్ పూర్తితో మొత్తం సెక్షన్లోని 209 కి.మీ.లు మూడో లైన్ తో పాటు విద్యుద్దీకరణ పూర్తి అయింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరవడి- సూరారెడ్డిపాలెం సెక్షన్ మధ్య ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్లోని బృందాన్ని, అధికారులను అభినందించారు. విజయవాడ- గూడూరు మధ్య మూడో లైన్ పనులను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఆ రద్దీని తగ్గిస్తుందని, రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆయన తెలియజేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు