చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ నావికా దళం స్వాధీనం

చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ నావికా దళం స్వాధీనం
ఇరాన్‌- అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్‌ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది.  ఇప్పుడు ఇరాన్‌ చర్యతో మధ్యప్రాచ్య సముద్ర మార్గంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
అంతకుముందు ఈ నౌకను సూయజ్‌ రజన్‌గా పిలిచే వారు. 2021లో ప్రారంభమై ఏడాది పాటు కొనసాగిన ఈ వివాదంలో అప్పట్లో అందులో ఉన్న మిలియన్‌ బ్యారెళ్ల ఇరాన్‌ క్రూడ్‌ను అమెరికాకు చెందిన జస్టిస్‌ శాఖ స్వాధీనం చేసుకుంది.  ఇరాన్‌ ప్రోత్సాహంతో యెమెన్‌ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలోని నౌకలపై డ్రోన్‌లు, క్షిపణులతో దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే.
కాగా, ఇరాన్‌ నేతృత్వంలో నడిచే టెలివిజన్‌ కూడా గురువారం నాడు నౌక స్వాధీనం చేసుకున్న విషయాన్ని నిర్ధారించింది.  ఒమన్, ఇరాన్ దేశాల మధ్య గురువారం ఉదయం ఈ నౌకను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలైనట్లు మధ్యప్రాచంలో ప్రయాణించే నౌకల సిబ్బందికి ప్రమాద హెచ్చరికలు అందించే బ్రిటీష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పేర్కొంది. 
 
నౌక సెక్యూరిటీ మేనేజర్‌నుంచి వచ్చిన ఓ టెలిఫోన్ సందేశంలో ఆయన గొంతుతో పాటుగా ఇతరుల గొంతుకలు కూడా వినిపించాయని ఆ సంస్థ తెలిపింది. నౌకను కాంటాక్ట్ చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలమయినట్లు తెలిసిన ఆ సంస్థ నౌకలోకి ప్రవేశించిన వారు మిలిటరీ దుస్తులు, నల్లటి ముసుగులు ధరించి ఉన్నట్లు తెలిపింది. 
 
సెయింట్ నికోలస్‌గా పిలవబడే ఆ నౌకలోకి ఆరుగురు మిలిటరీ వ్యక్తులు ప్రవేశించారని, నౌకలోకి ప్రవేశించే ముందు వారు నిఘా కెమెరాలను కవర్ చేశారని ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ అంబ్రూ తెలిపింది. ఇరాక్‌లోని బస్రా రేవులో చమురును నింపుకొని బయలుదేరిన ఈ ట్యాంకర్ టర్కీలోని అలియాగాకు వెళుతున్నట్లు తెలుస్తోంది.