30 నుంచి ఢిల్లీ- అయోధ్య అమృత్ భారత్ రైల్

30 నుంచి ఢిల్లీ- అయోధ్య అమృత్ భారత్ రైల్
శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్షి అనుసంధానం చేసేలా భారతీయ రైల్వే కొత్త వెర్షన్ రైలును తెర మీదకు తీసుకొస్తున్నది.  ప్రస్తుతానికి రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.  అమృత్ భారత్ పేరుతో తీసుకొస్తున్న కొత్త రైలులో రెండు వైపులా ఇంజిన్లు ఉండటమే కాదు.  రైలు మొత్తం నాన్ ఏసీగా రూపొందించారు. జనరల్ సీట్లతో పాటు రిజర్వుడ్ సిట్టింగ్ స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. 
ఈ రైలుకు 22 బోగీల్ని ఏర్పాటు చేస్తారు. ఈ రైలు గంట‌కు 130 కిలో మీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.  తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. మొత్తం 22 కోచ్ లు ఉంటాయి. వీటిల్లో త్రీటైర్ స్లీపర్ బోగీలు 12, జనరల్ బోగీలు 8, రెండు గార్డు కంపార్ట్ మెంట్స్ ఉంటాయి. వీటిల్లో కొంత భాగాన్ని స్త్రీలకు, దివ్యాంగులకు కేటాయిస్తారు. 
 దేశంలోని వివిధ నగరాలకు కలుపుతూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రయత్నంగా చెబుతున్నారు.  ఈ ప్రత్యేక రైలు అయోధ్యలో రామాలయ ప్రారంభానికి ముందే పట్టాల మీదకు వస్తోంది.  ఈ నెల 30న అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం అయోధ్య జంక్షన్ లో నిర్మించిన కొత్త బిల్డింగ్ ను ప్రారంభించటమే కాకుండా అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచేలా రెండు రైళ్లను ప్రారంభించనున్నారు.
 
ఢిల్లీ -దర్బంగా (బిహార్‌)మార్గంలో ఒకటి, బెంగాల్‌లోని మాల్దా- బెంగళూరు మధ్య మరో అమృత్ భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మరో ఆరు వందే భారత్‌ రైళ్లను సైతం ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. అయోధ్య- ఆనంద్‌ విహార్‌ (దిల్లీ), వైష్ణోదేవి- దిల్లీ, జాల్నా- ముంబయి, కోయంబత్తూర్‌- బెంగళూరు, అమృత్‌సర్‌ – దిల్లీ, మంగళూరు సెంట్రల్‌ – మడ్గావ్‌ మధ్య ఇవి నడవనున్నాయి.
 
ఎక్కువగా వర్కింగ్ క్లాస్ వారికి భారం లేకుండా ఉండేలా ఈ రైళ్లను ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందే కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల మధ్య ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ధరలు కూడా వందే భారత్ కంటే సగం ధర ఉంటుందని తెలుస్తోంది.  స్లీపర్ కోచ్ లతో నడిచే ఈ రైలు సామాన్య ప్రయాణీకులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంటున్నారు.