ఖాతాల్లోకి భారీగా నగదుతో చిక్కుల్లో వివేక్

ఖాతాల్లోకి భారీగా నగదుతో చిక్కుల్లో వివేక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అనుమానాస్పద నగదు లావాదేవీలపై నిఘా ఉంచడంతో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి చిక్కుల్లో పడ్డారు. వివేక్‌ డైరెక్టర్‌గా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్‌ ఖాతాతో పాటు, విజిలెన్స్‌సెక్యూరిటీ ఖాతాల్లోకి భారీగా నగదు జమ అయినట్లు గుర్తించారు. ఈ రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లో జమ అయిన రూ.8 కోట్లను పోలీసులు స్తంభింప చేశారు.

బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకులో ఉన్న రెండు సంస్థల ఖాతాల్లోకి ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కావడంతో ఆ నగదును స్తంభింప చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి ఈసీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఖాతాల్లో జమ అవుతున్న నగదు వివరాలను సేకరిస్తున్నారు. నవంబర్ 13వ తేదీన వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాల్లోకి రూ.8 కోట్లు జమ అయినట్లు గుర్తించారు. 

గుర్తు తెలియని ఖాతాల నుంచి పెద్దఎత్తున నగదు బదిలీ కావటంపై సైఫాబాద్‌ పోలీసులకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. ఈసీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నగదు లావాదేవీలపై ఆరా తీశారు. రెండు ఖాతాల్లో జమ అయి నగదును స్తంభింపజేశారు.  నగదును విత్‌డ్రా చేయకుండా ఫ్రీజ్ చేయాలని బషీర్‌బాగ్‌ ఐడీబీఐ బ్రాంచి మేనేజర్‌, నోడల్‌ అధికారి, ఆదాయపన్నుశాఖ, ఈడీ జాయింట్‌ డైరెక్టర్లకు సమాచారం ఇచ్చినట్టు డీసీపీ తెలిపారు.

రెండు సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు జమ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు డీసీపీ తెలిపారు.  నగదు జమ చేసిన వారిని విచారించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే నగదు జమ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.625 కోట్లు జప్తు

మరోవైపు తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.625 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.99.49 కోట్ల మద్యం,రూ.34.35 కోట్ల మత్తు పదార్థాలు,రూ.78.62 కోట్ల వస్తువులు,రూ.179 కోట్ల విలువ చేసే బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 నగదు,బంగారం మరియు ఇతర వస్తువులకు సరైన పత్రాలు లేదా ఆధారాలు చూపించిన వారికి తిరిగి ఇచ్చేస్తున్నారని వివరించారు. ఇలా ఉండగా, కారు డ్రైవర్లుగా పనిచేస్తున్న బొడుప్పల్ కు చెందిన మంద అనిల్ గౌడ్ (31),  మహబూబ్‌నగర్ జిల్లా మేడిపల్లి కి చెందిన ఏర్పుల రవి (35)కారు డ్రైవర్లు గా పని చేస్తున్నారు. 

వారిద్దరూ కలిసి ఆదివారం ఉదయం కారులో వెళుతుండగా బేగంపేట్ గ్రీన్లాండ్ సిగ్నల్స్ వద్ద నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన వాహనాల తనిఖీలలో వారి నుండి రూ.97.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పాత్రలు చుపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.