హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బంధీగా ఉన్న జర్మన్‌ యువతి మృతి

హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బంధీగా ఉన్న జర్మన్‌ యువతి మృతి
హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన జర్మన్‌-ఇజ్రాయెల్‌ యువతి షానీ లౌక్‌ (23) మరణించింది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. షానీ లైక్‌ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.  గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు షానీ లౌక్‌ మృతదేహాన్ని గుర్తించాయని ఇజ్రాయెల్ సర్కారు వెల్లడించింది. షానీ కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్‌ మీడియా ద్వారా ధ్రువీకరించింది. 
 
‘జర్మన్‌-ఇజ్రాయెల్‌ యువతి షానీ లౌక్‌ మృతదేహాన్ని గుర్తించాం. ఆమె మృతి గురించి తెలిసి మా హృదయం ముక్కలైంది. షానీని మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నుంచి హమాస్‌ మిలిటెంట్లు అపహరించారు. ఆమెను తీవ్రంగా వేధించారు. తర్వాత గాజా నగరం మొత్తం పికప్‌ ట్రక్కులో నగ్నంగా ఊరేగించారు. హమాస్‌ చేతిలో ఆమె అంతులేని వేదనను అనుభవించారు. ఆమె పరిస్థితితో మా హృదయం ముక్కలైంది’ అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.

‘మాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కారులో అపస్మారక స్థితిలో ఉన్న నా కుమార్తెను చూశాను. ఆ కారును గాజా నగరమంతా తిప్పడం కనిపించింది’ అని మృతురాలు షానీ తల్లి వాపోయింది. కాగా, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లో సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ జరుగుతున్న సమయంలో హమాస్‌ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్‌ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్‌ జరిగిన ప్రాంతంలోనే 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 1400 మంది మరణించారు. దాడి అనంతరం హమాస్‌ మిలిటెంట్లు కొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 23 ఏళ్ల షానీ లౌక్‌ కూడా ఒకరు. గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది.  వేలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న దవాఖానల సమీపంలో వైమానిక దాడులు జరుగుతుండటంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలా ఉండగా, ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతుండగా, కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హామాస్‌ విజయం సాధించేవరకు యుద్ధ ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు.

ఇప్పటిరకు గాజాలో 8300 మంది మరణించారని హమాస్‌ ప్రకటించింది. కాగా, హమాస్‌ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారని, 230కిపైగా మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహూ వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.