మాల్దీవులులో చైనా అనుకూల ప్రభుత్వం 

మన పొరుగున ఉన్న మాల్దీవుల్లో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ ముయిజ్జు విజయం సాధించడం వ్యూహాత్మకంగా భారత్ కు ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.  చైనా అనుకూల పార్టీ మాల్దీవుల్లో అధికారంలోకి రానుండటంతో ఇప్పుడు ఆ దేశం సైతం మరో శ్రీలంక మాదిరిగా మారే అవకాశం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది. 
 
ఇక వ్యాపారం పరంగానూ భారత్‌కు పోటీగా చైనా సంస్థలను మాల్దీవుల కొత్త ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకుంటోన్న చైనాకు మాల్దీవుల నూతన ప్రభుత్వం ద్వారాలు తెరిస్ అది మనకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
 
మొహమ్మద్ ముయిజ్జు (45)  విలాసవంతమైన బీచ్ రిసార్ట్‌లు, సెలబ్రిటీ టూరిస్ట్‌లకు ప్రసిద్ధి చెందిన అటోల్ నేషన్‌లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు చైనీస్ రుణాల ప్రవాహానికి అధ్యక్షత వహించిన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. రన్-ఆఫ్ పోటీలో అతను 54.06 శాతం ఓట్లను గెలుచుకున్నాడు. దానితో ప్రస్తుత అధ్యక్షుడు, భారత్ కు సన్నిహితుడిగా పేరొందిన ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమిని అంగీకరించాడు.
 
ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే తూర్పు-పడమర షిప్పింగ్ లేన్‌లలో ఒకటైన హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంది. మాల్దీవులు చాలా చిన్న ద్వీప దేశమే కావచ్చు. ఆ దేశ జనాభా కేవలం 5.2 లక్షలే కావచ్చు. కానీ హిందూ మహాసముద్రంలో భారత్‌కు కేవలం 2 వేల కి.మీ. దూరంలో,  వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 
 
మాల్దీవులు మొదటి నుంచి భారత్‌కు నమ్మకమైన నేస్తం. దశాబ్దాలుగా ఈ దేశంపై భారత్ ప్రభావం ఎక్కువ. రక్షణ రంగం, వాణిజ్యంలో సాయం చేస్తూ మాల్దీవులపై భారత్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మాల్దీవులపై భారత్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే. ఇక్కడి ఎన్నికలు భారత్ అనుకూల పార్టీ వర్సెస్ ప్రతికూల పార్టీ అనేలా మారాయి.
 
1965లో మాల్దీవులు బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. తొలినాళ్లలో మాల్దీవులను దేశంగా గుర్తించిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి.1988లో రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడైన మవూన్ అబ్దుల్ గయూమ్‌ను పదవి నుంచి తప్పించే కుట్రలను భారత సైన్యం రంగంలోకి దిగి రాత్రికి రాత్రే భగ్నం చేసింది. 
 
2008లో ఆ దేశం ప్రజాస్వామ్య విధానంలోకి మారేందుకు కూడా భారత్  సహకరించింది. దీంతో మాల్దీవులు మొదటి నుంచి ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న సోలిహ్ సైతం భారత్‌‌కు గట్టి మద్దతుదారు. నవంబర్ 17 వరకూ ఆయనే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

త్వరలో మాల్దీవులు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న ముయిజ్జూ చైనా అనుకూలుడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రొగ్రసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుస్‌కి చైనా అంటే వల్లమాలిన ప్రేమ. మాల్దీవుల్లో ప్రభుత్వం మారనుండటంతో విదేశాంగ విధానంపై, ముఖ్యంగా భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 

 
గతంలో శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల్లో చైనా అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరినప్పుడు భారత్‌ పట్ల ఆ దేశాల వైఖరి ఎలా మారిందో గమనించిన వారికి ఇప్పుడు మాల్దీవుల పరిణామాలు తేలిగ్గా అర్థమవుతాయి. 2013-18 మధ్య మాల్దీవులు అధ్యక్షుడిగా పని చేసిన అబ్దుల్లా యెమిన్ ముయిజ్జూకు గురువు. ఆయన హయాంలోనే భారత్‌-మాల్దీవుల సంబంధాలు దెబ్బతినడం మొదలైంది.
 
యెమిన్ భారత్‌కు బదులు చైనాకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ సమయంలోనే మాల్దీవులు చైనా దగ్గర చేసిన అప్పులు 20 శాతం పెరిగాయి. మాల్దీవులు సైతం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ (బీఆర్ఐ)లో భాగమైంది. గతంలో మంత్రిగా పని చేసిన మయిజ్జూ తమ దేశం బీఆర్ఐలో చేరడంలో, చైనా నుంచి నిధులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
 
‘మా పార్టీ అధికారంలోకి వస్  చైనాతో సంబంధాల విషయంలో నూతన అధ్యాయం మొదలవుతుంది’ అని గత ఏడాది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశం సందర్భంగా ముయిజ్జూ స్పష్టం చేశాడు.  2020లోనే ‘ఇండియా ఔట్’ అనే ప్రచారాన్ని ప్రొగ్రసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుస్ పార్టీ మొదలుపెట్టింది.
 
మాల్దీవుల్లో భారత సైన్యం ఉండటాన్ని ఆయన ఖండిస్తూ వచ్చిన ఆయన తాను అధికారంలోకి వస్తే మాల్దీవుల నుంచి భారత బలగాలను తొలగిస్తానని, తమ దేశ వాణిజ్య సంబంధాలను ‘బ్యాలెన్స్’ చేస్తానని ముయిజ్జూ హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ వాణిజ్యం విషయంలో ఆ దేశ ప్రధాన భాగస్వామి భారత్ ఉండటం గమనార్హం.