ఆసియా క్రీడల్లో జోరు కొనసాగిస్తున్న భారత్‌

ఆసియా క్రీడల్లో జోరు కొనసాగిస్తున్న భారత్‌
 
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు కొనసాగుతున్నది. చైనా వేదికగా జరుగుతున్న పోటీల్లో సోమవారం మన అథ్లెట్లు ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు.  మంగళవారం మరో పతాకం గెల్చుకోవడంతో మొత్తంగా 61 మెడల్స్‌ ఖాతాలో వేసుకున్న భారత్‌ వంద పతకాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది  పతకాల పట్టికలో 61 మెడల్స్‌తో భారత్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నది. 
 
ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్యం, 24 రజతాలు ఉన్నాయి. తొమ్మిదో రోజైన శుక్రవారం 3 రజతాలు 4 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు గెలుపొందారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న అన్సీ సోజన్‌ ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. ఈ 22 ఏళ్ల కేరళ సంచలనం లాంగ్‌జంప్‌లో భారత్‌కు రెండో రజతం అందించింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఐదో ప్రయత్నంలో సోజన్‌ శక్తినంతా కూడదీసుకొని 6.63 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని ముద్దాడింది. 
 
అత్యుత్తమ ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిని సోజన్‌.. స్వర్ణం గెలిచిన షికీ గ్జియాంగ్‌ కంటే 10 సెంటీమీటర్లు వెనుకబడి పసిడి దూరం చేసుకుంది
400 మీటర్ల మిక్స్‌ రిలే జట్టు చిరుతను తలపించే వేగంతో వెండి పతకం ఖాయం చేసుకుంది.  తుదిపోరులో మహమ్మద్‌ అజ్మల్‌ (43.14 సెకన్లు), విద్య రామరాజ్‌ (54.19 సెకన్లు), రాజేశ్‌ రమేశ్‌ (45.77 సెకన్లు), సుభా వెంకటేశన్‌ (51.24 సెకన్లు) బృందం 3 నిమిషాల 14.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. 
 
అయితే రెండో స్థానం దక్కించుకున్న శ్రీలంక అథ్లెట్లు పరుగు సమయంలో లైన్‌ దాటి అనర్హతకు గురి కావడంతో భారత్‌ కాంస్య పతకాన్ని రజతంగా ప్రకటించారు.  ఈ రేసుకు ముందు అర్హత పోటీలో విద్య 55.42 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దాంతో, అత్యంత వేగంగా 400 మీటర్లు పరుగెత్తిన భారతీయ మహిళగా 39 ఏళ్ల క్రితం పరుగుల రాణి పీటీ ఉష నెలకొల్పిన రికార్డును విద్య సమం చేసింది. 1984 ఒలింపిక్స్‌లో ఉష 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.42 సెకన్లలో పూర్తి చేసింది.
 
 పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్కేటింగ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు నెగ్గగా, లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ వెండి వెలుగులు విరజిమ్మింది. పురుషుల కనోయ్‌ డబుల్‌ 1000 మీటర్ల ఫైనల్‌లో టీమ్‌ఇండియా రజత పతకం సాధించింది. అర్జున్‌ సింగ్, సునీల్‌ సింగ్‌తో కూడిన భారత జట్టు 3:53.329 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.
 
మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పారుల్‌ చౌదరీ 9 నిమిషాల 27.63 సెకన్లలో రేసు పూర్తి చేసి వెండి పతకం చేజిక్కించుకుంది. రేసు ఆరంభం నుంచే దూసుకెళ్లిన పారుల్‌.. పసిడి నెగ్గిన బహ్రెయిన్‌ అథ్లెట్‌ యవి విన్‌ఫ్రైడ్‌ కంటే 9 సెకన్లు వెనుక ఉండిపోయింది. 
 
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పారుల్‌ ఏషియన్‌ గేమ్స్‌లోనూ అదే జోరు కనబర్చినా బంగారు పతకాన్ని మాత్రం తృటిలో కోల్పోయింది. ఇక ఇదే విభాగంలో భారత మరో అథ్లెట్‌ ప్రీతి 9 నిమిసాల 43.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలిచింది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు రజత, కాంస్యాలు దక్కాయి.
 
ఆసియా క్రీడల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు.. తమ విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నది. ఇప్పటికే సింగపూర్‌, పాకిస్థాన్‌పై భారీ తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన సోమవారం బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ , మన్దీప్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో భారత్‌12-0తో బంగ్లాను మట్టికరిపించింది. తద్వారా పూల్‌-‘ఎ’లో ఓటమి ఎరగని భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన ఐదో మ్యాచ్‌ల్లో రికార్డు స్థాయిలో 58 గోల్స్‌ కొట్టడం విశేషం.