హైదరాబాద్ శాస్త్రవేత్తకు భట్నాగర్‌ అవార్డు

హైదరాబాద్ శాస్త్రవేత్తకు భట్నాగర్‌ అవార్డు
 
ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుకు హైదరాబాద్ కు చెందిన జీవ శాస్త్రవేత్త మద్దిక సుబ్బారెడ్డి ఎంపికయ్యారు.  హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ అండ్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్‌ మద్దిక సుబ్బారెడ్డి దేశంలోని అత్యున్నత సైన్స్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.
 
సాధారణ, క్యాన్సర్‌ కణాల జీవక్రియలపై ఆయన అధ్యయనం చేశారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్ఐఆర్‌) 2022 ఏడాదికి సంబంధించి ఈ అవార్డులను ప్రకటించింది. ఈనెల 26న సీఎస్ఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం జరగనున్న నేపథ్యంలో సుబ్బారెడ్డి సహా 12 మంది శాస్త్రవేత్తలను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. దీనికింద ప్రశంసాపత్రంతో పాటు రూ.5 లక్షల నగదును బహూకరిస్తారు. 
 
ఈసారి మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలో దీప్యమాన్‌ గంగూలీకి, జీవశాస్త్ర విభాగంలో అశ్వని కుమార్‌, మద్దిక సుబ్బారెడ్డిలకు అవార్డు దక్కింది. వాతావరణ, గ్రహాల పరిశోధన విభాగంలో విమల్‌ మిశ్రా, రసాయన శాస్త్ర విభాగంలో అక్కట్టు టీ బిజు, దెబవ్రత మైతీ ఎంపికయ్యారు.  ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ విభాగంలో దీప్తి రంజన్‌ సాహూ, రజనిష్‌ కుమార్‌, గణిత శాస్త్రంలో అపూర్వ ఖరే, నీరజ్‌ కయల్‌ అవార్డు సాధించారు. భౌతిక శాస్త్రంలో బసుదేబ్‌, అనింద్య దాస్‌ను శాంతి స్వరూప్‌ అవార్డు వరించింది.