జమిలి ఎన్నికలపై ప్రభుత్వం నియమించిన కమిటీకి సారథ్యం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ విషయమై కసరత్తు ప్రారంభించారు. వాస్తవానికి ఈ కమిటీ నియామకానికి మూడు నెలల ముందు నుండే ఆయన ఈ విషయమై విస్తృత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పది మందికి పైగా గవర్నర్ లను, పలువురు నిపుణులను కలసి సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
తాజాగా, ఈ కమిటీ సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. జమిలి కమిటి తరఫున తమది కోవింద్జీతో జరిపిన తొలి అధికారిక మర్యాదపూర్వక సమావేశం అని అక్కడున్న విలేకరులతో అమిత్ షా చెప్పారు.
ఇది తొలి భేటీనా? ఏదైనా నిర్ణయం జరిగిందా? ఇక ముందు జమిలిపై ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు ఇద్దరూ జవాబివ్వలేదు. ఇక ముందు జరగబోయే అధికారిక తొలి భేటీకి ఇది ముందస్తు సమావేశంగా భావించాల్సి ఉంటుందని అమిత్ షా తెలిపారు.అయినా పెద్దాయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు ఈ దశలో న్యాయశాఖ మంత్రి వివరించి వెళ్లారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ తొలి భేటీ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనేది త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు.
సభ్యులంతా భేటీకి హాజరు అవుతారా? అనేది చెప్పలేమని కూడా అన్నారు. ఎన్నిసార్లు భేటీలు జరుగుతాయి? అనేది చెప్పలేమని పేర్కొన్నారు. అయితే జమిలి కమిటి పరిశీలన ప్రక్రియను వేగిరపర్చేందుకు మాజీ రాష్ట్రపతి వద్దకు కేంద్ర మంత్రులు వచ్చినట్లు వెల్లడైంది. కాగా ప్యానల్కు ఎప్పటికప్పుడు సహకరించేందుకు అవసరం అయిన ఆఫీసర్లను నియమించేందుకు న్యాయమంత్రిత్వశాఖ సిద్ధం అయింది. తమ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి న్యాయపరమైన అంశాలను పొందుపర్చేందుకు కసరత్తు చేస్తోంది.
కాగా రామ్నాథ్ కోవింద్ సారధ్యం గురించి ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఇప్పటికీ కోవింద్ నుంచి దీనికి సంబంధించి సమ్మతి విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. కాగా కమిటీలో కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ చౌధురి పేరును ప్రభుత్వం ప్రకటించింది. కానీ తాను ఇందులో ఉండబోనని ఆయన ప్రకటించారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!