రూ 30 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ

రూ 30 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ
అమృత్‌ భారత్‌ పథకం కింద మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు త్వరలో రూ. 30 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ భవనంను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్‌ అవసరాలకు అనుగు ణంగా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. రైల్వేలైన్‌లకు రెండు వైపులా స్టేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా పట్టణానికి రెండు వైపులా కలిసి ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.
 
ప్రయాణికులు స్టేషన్‌లోకి వచ్చి, వెళ్లే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు, స్టేషన్‌ లోపల విశాలమైన కారిడార్లు, బయట ప్రయాణికుల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా విశాలమైన దారులు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, స్కైవాక్‌ రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించనున్నారు.  స్టేషన్‌లో వెయిటింగ్‌ హాల్‌లు, షాప్‌లు ఏర్పాటు చేయడానికి గదులు, మరిన్ని టికెట్‌ కౌంటర్లు, డ్రింకింగ్‌ వాటర్‌ సౌకర్యం, విశ్రాంతి హాల్‌లు, దూర ప్రాంత ప్రయాణికులు బస చేయడానికి డార్మెటరీ రూంలు నిర్మించనున్నారు.
స్టేషన్‌ లోపల, బయట సీసీ కెమెరాల ఏర్పాటు, అగ్ని ప్రమాదాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసరంగా వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేయనున్నారు.  విద్యుత్‌, నీటిని ఆదా చేసి స్వయం సమృద్ధి సాధించేలా స్టేషన్‌ను రూపొందిం చనున్నారు. పార్శిల్‌ కౌంటర్‌లను అభివృద్ధి చేసి గూడ్స్‌ వాహనాలు కౌంటర్ల వద్దకు చేరుకునేలా దారులు ఏర్పాటు చేయనున్నారు.
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టేందుకు స్టేషన్‌ పైన సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఇంధన ఖర్చులు తగ్గించడం ద్వారా పర్యావరణ సమతుల్యానికి దోహదపడేలా స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు.  రాబోయే 50 సంవత్సరాల ను దృష్టిలో ఉంచుకుని ఆధునికీకరణ పనులు చేపట్టడంతో పర్యావర ణ అనుకూల రైల్వేస్టేష న్‌లను రూపొందించడమే అమృత్‌ భారత్‌ పథకం లక్ష్యం. టెండరింగ్‌ ప్రక్రియ పూర్తి కాగానే పనులు చేపట్ట నున్నట్లు మంచిర్యాలరైల్వేస్టేషన్‌ మేనేజర్‌ ఆర్‌వీ రామానుజన్‌ తెలిపారు.
ఢిల్లీ – చెన్నైల మధ్య ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైలు మార్గంలో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ద్వారా రైల్వేశాఖకు అధిక రెవెన్యూ సమకూరుతోంది. దాదాపు అన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఉంది. టికెట్ల ద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి మంచిర్యాలకు రైలు ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ మధ్య కొత్తగా వందే భారత్‌ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ రైలు ద్వారా మంచిర్యాల నుంచి ప్రయాణం చేసే వారికి మరింత వెసులుబాటు కలగడంతోపాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.