జులై 3 నుంచి టీవీ సీరియల్ రామాయణం పునఃప్రసారం

జులై 3 నుంచి టీవీ సీరియల్ రామాయణం పునఃప్రసారం
ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన రామానంద్ సాగర్ రామాయణ్ ధారావాహికం తిరిగి టీవీలో ప్రసారం కానుంది. ప్రఖ్యాత షెమారూ టీవీ ఛానల్‌  ఈ సీరియల్ సోమవారం నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 గంటల సమయంలో ఈ సీరియల్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ టీజర్‌ను కూడా వదిలింది.

ఈ రామాయణంలో రాముడిగా అరుణ్‌గోవిల్, సీతగా దీపికా చకిలా , లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. ఇక కీలక పాత్రలో హనుమంతుడిగా దారాసింగ్ , రావణుడుగా అరవింద్ త్రివేది నటించారు. పాత్రలకు తగ్గట్లుగా ఆహార్యం, అభినయం హుందాతనం ప్రదర్శించడంతో అందరిని ఈ సీరియల్ ఆకట్టుకుంది.

అప్పట్లో ఈ సీరియల్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31వరకూ సాగింది. ప్రజల నుంచి మంగళహారతులతో స్పందనలు పొందింది. అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న సీరియల్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకుంది.  ఎన్నో ఏండ్ల పాటు ఈ సీరియల్‌ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్‌ను కరోనా సమయంలో రీటెలికాస్ట్‌ చేశారు. 2020 మార్చి 28వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం టెలికాస్ట్‌ చేశారు. అప్పుడు కూడా ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు ఆదిపురుష్‌ వివాదం తర్వాత రెండోసారి రీటెలికాస్ట్‌కు సిద్ధమైంది.

ఆదిపురుష్‌ విడుదల తర్వాత ఇప్పుడు దేశమంతటా రామాయణం గురించే చర్చ జరుగుతోంది! ఆ సినిమాను ఎలా తీయగూడదో అనే విమర్శలు చెలరేగుతున్నాయి.  ఆదిపురుష్ సినిమాలోని పాత్రలు సంభాషణలు వివాదాలకు దారితీశాయి. పాత్రలను కించపర్చే విధంగా సినిమా సాగిందనే విమర్శలు తలెత్తాయి.

ఇతిహాసాలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి తరుణంలో ఆ సీరియల్‌ను మరోసారి టెలికాస్ట్‌ చేసి రామాయణం విశిష్టతను తెలియజేయాలని చాలామంది నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ క్రమంలోనే రామానంద్‌సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్‌ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.