బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ లో లష్కరే ఉగ్రవాది హతం

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ లో లష్కరే ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీరులో శనివారం రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. రాజౌరి, బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రాజౌరిలో ఇప్పటికే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
బారాముల్లా జిల్లాలోని కుంజర్‌  ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు సెర్చ్‌ ఆపరేషన్‌ బృందాలపై కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు భద్రతా బలగాలకు ఉగ్రవాదులు కనిపించారని, ఎదురు కాల్పులు జరుగుతున్నాయని రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
దీంతో భద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాయడని జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ తెలిపారు. అతడిని లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని చెప్పారు.   కశ్మీర్‌లో జీ20 సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూలో పర్యటిస్తున్నారు.
కాగా, బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమార్చిన విషయం తెలిసిందే.  రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంర్‌ చోటుచేసుకోవడం విశేషం. శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు సైనికులపై పేలుడు పదార్థం విసిరారని ఆర్మీ పేర్కొన్నది.
 
ఇటీవల జమ్ము రీజియన్‌లో ఆర్మీ ట్రక్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది. ఈ సందర్భంగా జరుగుతున్న ఎదురు కాల్పులలో ఉగ్రవాదులతో మరికొందరు చనిపోయి ఉండవచ్చని భద్రతాదళాలు భావిస్తున్నాయి.