ఉక్రెయిన్లోని మారియుపోల్‌ నగరంలో పుతిన్ ప్రత్యక్షం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సంవత్సరంకు పైగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే చాలా ఉక్రెయిన్‌ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. యుద్ధ నేరాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేసింది.
 
అయినా, రష్యా అధ్యక్షుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం ఆకస్మికంగా ఉక్రెయిన్లోని మారియుపోల్‌ నగరంలో పర్యటించారు. ఈ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించింది. డొనెట్స్క్ రాష్ట్రంలోకి వచ్చే ఈ నగరం గత ఏడాది మే నుంచి రష్యా ఆధీనంలో ఉన్నది.  ఈ క్రమంలో పుతిన్‌ తొలిసారి క్రిమియాకు చేరుకొని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మారియుపోల్‌ నగరానికి చేరుకున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో పుతిన్ స్వయంగా కారులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతోనూ మాట్లాడారు. మరియూపోల్ బీచ్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని సైనిక ఆపరేషన్‌ టాప్‌ కమాండర్‌ను సైతం కలిశారు. ఉక్రెయిన్‌లో రష్యాకు ప్రాతినిథ్యం వహిస్తున్న చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో భేటీ అయ్యారు. దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ఆన్ డాన్ కమాండ్ పోస్ట్‌లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది..రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ శుక్రవారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని కోర్టు పేర్కొంది. ఉక్రేనియన్ పిల్లలను కిడ్నాప్ చేయడం తదితర నేరాలకు బాధ్యుడిని చేసింది. అయితే, ఈ ఆరోపణలను మాస్కో ఖండించింది. వారెంట్‌పై సైతం ఉక్రెయిన్‌ సైతం స్పందించింది. ఇది ప్రారంభం మాత్రమేనని.. వారెంట్ తర్వాత, పుతిన్‌కు ముందుముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్నారని పేర్కొంది.