జనవరిలో రూ. 51 లక్షల కోట్ల డిజిటల్​ చెల్లింపులు

ఈ ఏడాది జనవరి  నెలలో రూ. 51 లక్షల కోట్ల విలువైన 1,50 కోట్ల డిజిటల్​ చెల్లింపుల లావాదేవీలు దేశంలో జరిగాయని, మన డిజిటల్​ చెల్లింపుల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియజేస్తుందని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్ ​ చెప్పారు. చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేజ్​ (యూపీఐ) ఒక విప్లవం తెచ్చిందని ఆయన తెలిపారు.

జనవరిలో జరిగిన డిజిటల్‌ చెల్లింపులలలో యూపీఐ ద్వారా  రూ.13 లక్షల కోట్ల విలువైన 803 కోట్ల లావాదేవీలు ప్రాసెస్​  అయ్యాయని వెల్లడించారు.  చెల్లింపు వ్యవస్థ​ ఆపరేటర్లు, ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యపడిందని చెబుతూ, దీని ఫలితంగా గ్లోబల్​ పేమెంట్స్​ రంగంలో రిజర్వ్​ బ్యాంక్​ స్టార్​ హోదా సంపాదించుకోలిగిందని దాస్​ తెలిపారు.

కొచ్చిలో పేమెంట్​ సిస్టమ్​ ఆపరేటర్ల (పీఎస్​ఓ) కాన్ఫరెన్స్​లో ఆర్​బీఐ గవర్నర్​ పాల్గొంటూ భారత్ లో  చెల్లింపుల స్వరూపమే మారిపోయిందని, అత్యాధునికంగా సాగుతోందని దాస్​ చెప్పారు. మన తాజా పేమెంట్స్​ సిస్టమ్​ అందుబాటులో ఉండటమే కాకుండా, సౌకర్యవంతం​గానూ, వేగంగానూ, భద్రంగానూ కూడా ఉందని పేర్కొన్నారు. 

దేశంలో సుమారు 114 కోట్ల మొబైల్​ ఫోన్​ కనెక్షన్లున్నాయని, ఇందులో 55 శాతం వాటా పట్టణ ప్రాంతాలదైతే, మిగిలిన 45 శాతం గ్రామీణ ప్రాంతాలదని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు. మొబైల్​ ఫోన్ల వాడకం పెరగడంతోపాటు, ఇంటర్​నెట్​ సేవలు అందుబాటులోకి రావడం  డిజిటల్​ పేమెంట్ల జోరు ఎక్కువవడానికి దారితీసిందని వివరించారు.

బ్యాంకు బ్రాంచీల వర్కింగ్​ అవర్స్​తో సంబంధం లేకుండా ఎనీటైమ్​..ఎనీవేర్​ బ్యాంకింగ్​ సాధ్యమవుతోందని పేర్కొన్నారు.  డేటా విడుదలలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా పారదర్శకం​గా వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది కూడా ఎకో సిస్టమ్​లోని వారికి తెలుస్తోందని ఆయన చెప్పారు.

నగదు తక్కువగా ఉండే సమాజం వైపు చురుగ్గా కదలాలనేదే దీని వెనక ఉన్న ఉద్దేశమని దాస్ తెలిపారు. ఇదే సమయంలో పేమెంట్​ సిస్టమ్స్​ ఆరోగ్యకరంగానూ ఉండేలా చూస్తున్నామని చెప్పారు. రెగ్యులేటరీ వ్యవస్థ తీసుకునే చర్యలను వెంటనే పేమెంట్ ​సిస్టమ్​ ఆపరేటర్లు (పీఎస్​ఓ) అమలులోకి తేవాలని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఈ సందర్భంగా సూచించారు.

కలిసి పనిచేద్దాం….పేమెంట్స్ ఎకోసిస్టమ్​ అందరికీ కలిసొచ్చేలా చూద్దామని పీఎస్​ఓలకు దాస్​ పిలుపునిచ్చారు. 2018 మార్చిలో తెచ్చిన డిజిటల్​ పేమెంట్​ ఇండెక్స్​ సెప్టెంబర్ 2022 నాటికి 377.46 పాయింట్లకు చేరిందని దాస్​ వెల్లడించారు.  మొదలు పెట్టినప్పుడు ఈ ఇండెక్స్​ బేస్​ 100 పాయింట్లని చెప్పారు. మనం చాలా దూరం ప్రయాణించామనడానికి ఈ ఇండెక్స్​ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.

డిజిటల్​ పేమెంట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు వచ్చే సమస్యలూ అలాగే పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్​ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఆపరేషనల్​ ఇష్యూస్​ ఇందులో ఉన్నాయని అన్నారు. కొత్తగా రాబోయే సవాళ్లకు ధీటైన రిస్క్​మిటిగేషన్ చర్యలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని పేమెంట్​ సిస్టమ్​ ఆపరేటర్లకు ఆయన సలహా ఇచ్చారు. మన సొంత పేమెంట్​ ప్రొడక్టులైన యూపీఐ, రూపే నెట్​వర్క్​లు ఇప్పుడు గ్లోబల్ ​లెవెల్​కు ఎదిగాయని, విదేశాలలో సైతం విస్తరిస్తున్నాయని దాస్ తెలిపారు.