మాస్కోలో పుతిన్‌తో జీ జిన్‌పింగ్‌ భేటీ

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌  వ‌చ్చే వారం మాస్కోలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో భేటీకానున్నారు. ఈ విష‌యాన్ని అధికారులు వెల్ల‌డించారు. ఆ భేటీలో స‌మ‌గ్ర‌మైన భాగ‌స్వామ్య‌, వ్యూహాత్మ‌క స‌హ‌కారం గురించి చ‌ర్చించ‌నున్న‌ట్లు ర‌ష్యా అధికారులు వెల్ల‌డించారు.  ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఇటీవ‌ల చైనా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రి భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. కానీ ప‌శ్చాత్య దేశాలు మాత్రం చైనాపై ఆగ్ర‌హంగా ఉన్నాయి. డ్రాగ‌న్ దేశం ర‌ష్యాకు ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆరోపిస్తున్నాయి. పుతిన్ అందించిన ఆహ్వానం మేర‌కు మార్చి 20 నుంచి 22 వ‌ర‌కు జీ జిన్‌పింగ్ మాస్కోలో పర్య‌టిస్తార‌ని చైనా విదేశాంగ శాఖఅధికారులు తెలిపారు. ఇద్ద‌రు నేత‌లు ప‌లు ద్వైపాక్షిక డాక్యుమెంట్ల‌పై సంత‌కాలు చేయ‌నున్నారు.

వ్యూహాత్మక సహకారంపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారని ఆ వర్గాలు తెలిపాయి.  ఫ్రెండ్‌షిప్‌, పీస్ ఉద్దేశంతో ఆ ట్రిప్ సాగ‌నున్న‌ట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్న‌ది. జీ జిన్‌పింగ్‌ను తాను కూడా క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అంతర్జాతీయ గతేడాది బీజింగ్‌లో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి పుతిన్‌ హాజరయ్యారు. అలాగే సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ప్రాంతీయ భద్రతా సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. అయితే జిన్‌పింగ్‌ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు. దీంతో నాలుగేళ్ల అనంతరం ఇది జిన్‌పింగ్‌ మొదటి అధికారిక పర్యటన కానుంది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్యలకు ఏడాది పూర్తయిన అనంతరం జిన్‌పింగ్‌ మొదటిసారి రష్యాలో పర్యటించనున్నారు.