లవ్ జీహాద్, ల్యాండ్‌ జీహాద్‌లపై ముంబైలో నిరసన ర్యాలీ

ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి పోయి, మతం మార్చుతుండటంపై ముంబైలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అనేక హిందూ సంస్థలు, వాటి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం ఆదివారం శివాజీ పార్క్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. వీరిలో బాలలు కూడా ఉండటం విశేషం. సకల హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

హిందూ జ‌న ఆక్రోశ్ మోర్చా పేరుతో ర్యాలీ చేప‌ట్టారు. దాద‌ర్‌లోని శివాజీ పార్క్ నుంచి పార్లేలోని కామ్‌గ‌ర్ మైదాన్ వ‌ర‌కు సుమారు 4 కిలోమీట‌ర్ల మేర ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లకు వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్లను వీరు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులను మేలుకొలిపే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.

 ముఖ్యమంత్రి ఏక‌నాథ్ షిండేతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కొంద‌రు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ల‌వ్ జిహాద్‌కు అడ్డుకునేందుకు ఇత‌ర రాష్ట్రాలు తయారు చేసిన చ‌ట్టాల‌ను ప‌రిశీలించి, తాము కూడా ఓ చ‌ట్టాన్ని రూపొందించ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తెలిపారు.

నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ, లవ్ జీహాద్ కేవలం గ్రామాల్లో మాత్రమే జరుగుతోందని, మహారాష్ట్రలో లేదని చెప్పడం చాలా తప్పు అని తెలిపారు. ఈ తుపాను తమ ఇళ్లలోకి రాకూడదని స్పష్టం చేశారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని, మహారాష్ట్రలో కూడా అటువంటి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రేమ అంటే ఏమిటని మరికొందరు ప్రశ్నించారు. ఘర్షణపడితే, వెంటనే గర్ల్ ఫ్రెండ్‌ని 35 ముక్కలుగా నరకడమా? ఆమె తలను ఫ్రిజ్‌లో పెట్టడమా? అని ప్రశ్నించారు. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్యోదంతాన్ని వీరు పరోక్షంగా ప్రస్తావించారు. మన దేశంలో పారశీకులు, సిక్కులు, జైనులు వంటి మతాలవారు ఉన్నారని, ఆ మతాల పెద్దలు జనాన్ని బ్రెయిన్‌వాష్ చేస్తున్నట్లు మనకు ఎందుకు కనిపించడం లేదని అడిగారు.

కొందరు నిరసనకారులు మాట్లాడుతూ, హిందువుల భూములను ముస్లింలు అక్రమంగా లాక్కుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. హిందువులను వేధించి, చట్టవిరుద్ధంగా భూములను సొంతం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో స్థానిక జనాభాలో వారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో కూడా చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న మసీదులు, ఇతర నిర్మాణాలు ల్యాండ్ జీహాద్‌కు సంకేతాలని తెలిపారు. దీనిపై తాము ప్రజలను మేలుకొలుపుతున్నామని చెప్పారు. ఈ కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుంటేనే, జరుగుతున్నదేమిటో ప్రజలు తెలుసుకోగలుగుతారని చెప్పారు.

వీహెచ్‌పీ నేత ఆందోళన

విశ్వ హిందూ పరిషత్  నేత శ్రీరాజ్ నాయర్ మాట్లాడుతూ, నగరంలో అనేక చట్టవిరుద్ధ నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయని; అందువల్ల నగరానికి భద్రతాపరమైన ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ దేశాన్ని చూసి గర్వపడాలని మరికొందరు నిరసనకారులు చెప్పారు. ఉదాహరణకు చైనీయులు, జపనీయులు తమ దేశం పట్ల విపరీతమైన అభిమానాన్ని కలిగియుంటారని పేర్కొన్నారు.

చైనీయులు కేవలం చైనాను మాత్రమే అభిమానిస్తారని గుర్తు చేశారు. జపనీయులు కేవలం జపాన్‌ను మాత్రమే ప్రేమిస్తారని చెప్పారు. కానీ లవ్ జీహాద్‌లో యువతులను పురుషులు మోసం చేస్తున్నారని, పురుషులు హిందువులుగా నటిస్తూ, ఈ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేరు, రూపం హిందువుగా మార్చుకుని, యువతులను బుట్టలో వేసుకుని, తమతోపాటు కలిసి ఉండేలా చేస్తున్నారని, ఆ తర్వాత ఆ యువతుల మతాన్ని మార్చుతున్నారని పేర్కొన్నారు.

తమను ఎవరూ రాడికలైజ్ చేయలేదని మరికొందరు చెప్పారు. అందరూ ఐకమత్యంగా ఉండాలనే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. తమకు ముస్లిం స్నేహితులు ఉన్నారని, దేశం ముక్కలవాలని, విభజన బీజాలు నాటాలని తాము కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమకు ఆదర్శమని చెప్పారు.

ముస్లింలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భారత సైన్యంలో సైనికుడు అబ్దుల్ హమీద్‌కు మరణానంతరం భారత దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర్ చక్రను అందజేశారని గుర్తు చేశారు. వారు ఎటువంటి దృష్టాంతాలను సృష్టించారో గమనించాలని కోరారు.