సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పరంపర

అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు ముసురుకుంటున్న వేళ బడా కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తుండడంతో అమెరికాలో పని చేస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏడాది, రెండేళ్ల ముందు వెళ్లిన వాళ్లకే కాదు.. ఇరవై ఏళ్లుగా ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి సైతం ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. గడిచిన మూడు నెలల్లో అమెరికాలో ఏకంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పడింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు లక్షమందిపై పడనుంది.
సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతోంది. ప్రముఖ మల్టినేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాప్ట్‌, మెటా బాటలో మరిన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం, జర్మనీ కంపెనీ ఎస్‌ఏపీ చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఐబీఎం పేర్కొనగా, 3000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఎస్‌ఏపీ వెల్లడించింది.
అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో లక్ష్యాలను అందుకోలేక పోయామని, దీనికితోడు కొన్ని అసెట్‌ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.  మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.5 శాతం మాత్రమేనని తెలిపింది. అయితే క్లయింట్‌-ఫేసింగ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జేమ్స్‌ కవనాగ్‌ వెల్లడించారు.
2022లో కంపెనీ 10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. కానీ అది 9.3 బిలియన్‌ డాలర్ల వద్ద ఆగింది. నిర్వహణ మూలధన వ్యయాలు అంచనాలను మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఐబీఎం తెలిపింది. మరోవైపు ఎస్‌ఏపీ కూడా ఆర్థికపరమైన భారాలను ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణంగా చూపుతోంది. కీలక వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నామని ఎస్‌ఏపీ వివరించింది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1.2లక్షల మంది సిబ్బంది పనిచేస్తుండగా, తాజా తొలగింపులు ఇందులో 2.5శాతం మాత్రమేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.కాగా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాద్యం భయాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు క్రమంగా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. దీంతో అమెజాన్‌లో 18 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోగా, మెటా 11 వేలు, గూగుల్‌ 12 వేలు, మైక్రోసాప్ట్‌ 10 వేల మందిని తొలగించాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అక్కడి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న కంపెనీలకు ఇది అదనపు భారంగా మారింది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి వస్తుండడంతో కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. దీంతో తక్షణ నష్ట నివారణ చర్యలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, జీతాల్లో కోత వంటి చర్యలతోనూ సమస్యను పరిష్కరించే అవకాశాలున్నా.. ఉద్యోగులను వదిలించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉద్యోగం కోల్పోయిన వేలాది హెచ్‌-1బీ వీసాదారులు తదుపరి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.