ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్ ఇళ్లను జప్తు చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా జప్తు చేసింది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పునరుద్ఘాటించింది.
మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్ కారణంగా ఢిల్లీ సర్కారుకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చార్జ్షీట్లో స్పష్టంచేసింది. ఈ కేసులో సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా జడ్జి ఎంకే నాగ్పాల్ జారీ చేసిన ఉత్తర్వులు పలు విషయాలను వెల్లడించాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా సమీర్ మహేంద్రు ఉండగా, మద్యం వ్యాపారి బినయ్ బాబు, అమిత్ అరోరా, దక్షిణాదికి చెందిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, పి.శరత్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి/ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు గుర్తుచేసింది.
భారీ ఎత్తున అక్రమార్జనకు లోపభూయిష్టంగా విధానాన్ని రూపొందించారని తెలిపింది. హోల్సేలర్ల లాభాలను 12 శాతానికి నిర్ణయించారని, అందులో 6 శాతం మేరకు తిరిగి ముడుపులుగా చెల్లించాలనుకున్నారని, అందుకోసం ఖాతా పుస్తకాలను కూడా తారుమారు చేశారని వెల్లడించింది. ఈ కుట్రలో ఆప్కు మొత్తం రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. సమీర్ మహేంద్రు రూ. 295.45 కోట్ల మేర నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొన్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్షీట్ను విచారణకు స్వీకరించడంపై సీబీఐ కోర్టు ఈనెల 28న నిర్ణయం తీసుకోనుంది. ఈడీ దాఖలు చేసిన 13,567 పేజీల చార్జ్ షీట్లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు ఉనట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ గతంలో కోర్టుకు వివరించారు.
ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన జడ్జి నాగ్ పాల్.. సప్లిమెంటరీ చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 28న విచారణ జరుపుతామని వెల్లడించారు.
More Stories
నెస్లేపై విచారణకు ఆదేశించిన కేంద్రం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
మరోసారి అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి