మార్గనిర్దేశం చేసే ధ్రువతార రాజ్యాంగ మౌలిక స్వరూపం

భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం ధ్రువతార వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. మనం పయనించాల్సిన మార్గం సంక్లిష్టంగా ఉన్నప్పుడు అది రాజ్యాంగ వ్యాఖ్యాతలకు, కార్యనిర్వాహక వర్గానికి సూచనలతో మార్గనిర్దేశం చేసి ధ్రువ నక్షత్రంలా దారిచూపుతుందని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన నానీ ఎ పాల్కీవాలా స్మారక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం ఆత్మ దెబ్బతినకుండా అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగిఉంటుందని తెలిపారు. మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం లేదా తత్వం అనేది రాజ్యాంగ ఆధిపత్యం, చట్టబద్ధమైన పాలన, అధికారాల విభజన, న్యాయసమీక్ష, లౌకికవాదం, సమాఖ్య విధానం, స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం, ఐక్యత, దేశ సమగ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగానికి ఎవరూ మార్చలేని ఒక నిర్దిష్ట గుర్తింపు ఉందని నానీ పాల్కీవాలా తమకు చెబుతూ ఉండేవారని జస్టిస్‌ చంద్రచూడ్‌ గుర్తుచేసుకొన్నారు. గతకొంత కాలంగా భారత న్యాయవ్యవస్థ కూడా గణనీయమైన మార్పులు చెందుతూ వస్తున్నదని చెబుతూ కఠినమైన నిబంధనలను తొలగించేందుకు అనుకూలత, వినియోగదారుల సంక్షేమాన్ని పెంపొందించడం, వాణిజ్య లావాదేవీలకు మద్దతు పలకడంలో చురుగ్గా పనిచేస్తున్నదని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

సీజేఐపై ప్రధాని ప్రశంసలు
ఇలా ఉండగా, న్యాయస్థానాల తీర్పులను త్వరలో ప్రాంతీయ భాషల్లోనూ అందిస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రకటించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎంతో మంది పౌరులకు, ముఖ్యంగా యువకులకు ఇది దోహదపడుతుందని చెప్పారు. తీర్పులను అనువాదం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటామని గోవా, మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ తెలిపారు. ఈ ప్రసంగ వీడియోను మోదీ ట్వీట్‌ చేశారు.

మరోవంక, కొలీజియం వ్యవస్థను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి ప్రస్తావిస్తూ తనకు తానే న్యాయమూర్తులను నియమించుకోవాలని నిర్ణయించుకోవడం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని హైజాక్‌ చేసిందని ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ సోథి పేర్కొన్నారని చెబుతూ ఓ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.

జస్టిస్‌ సోథి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘మెజారిటీ ప్రజలు ఇలాంటి వివేకవంతమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాతీర్పును విస్మరించే వ్యక్తులు మాత్రమే భారత రాజ్యాంగానికి తాము అతీతమని భావిస్తారు’ అని రిజిజు తన ట్వీట్‌లో తెలిపారు.