కర్నూల్ లోనే కృష్ణ బోర్డు కార్యాలయం!

కృష్ణా జలాల నిర్వహణ పై ఏర్పాటైన కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్ఎంబి) ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన సొంతపార్టీ నేతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల పట్ల విముఖత వ్యక్తం చేశారు.
 
కడప, కర్నూలు జిల్లాలకు చెందిన 9 మంది ఎంపీ, ఎంఎల్ఏలు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలలో కేఆర్ఎంబిని కర్నూలులో చేయాల్సిన ఆవశ్యకతను వివరించారని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ద్వారా ఏర్పాటైన కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో కాకుండా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా రాయలసీమ ఉద్యమ సంఘాలు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ లేఖలు వ్రాసిన వారిలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల లోక్ సభ సభ్యుడు పీ.బ్రహ్మానంద రెడ్డి, శాసన సభ్యులు హఫీస్ ఖాన్ (కర్నూలు), డాక్టర్ సుధాకర్ (కోడుమూరు), శిల్పా రవిచంద్రా రెడ్డి (నంద్యాల), కే శ్రీదేవి (పత్తికొండ), కాటసాని రాంభూపాల రెడ్డి (పాణ్యం), కడప జిల్లాకు చెందిన కే.శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దటూరు), ఎస్ రఘురామిరెడ్డి (మైదుకూరు), సీమ ప్రాంతానికి చెందిన శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) తిరుపాల్ రెడ్డి, ప్రొద్దటూరు మాజీ శాసన సభ్యుడు ఎన్.వరదరాజులు రెడ్డి ఉన్నారు.

లేఖల ద్వారానే కాకుండా రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత్రానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తమ డిమాండ్ కు మద్దతు ప్రకటించారని కూడా దశరధ రామిరెడ్డి తెలిపారు. ఇక ప్రజా ప్రతినిధులు సంతకాలు చేసిన లేఖలతో పాటు తెలుగు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా జలాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలోనే కృష్ణా జలాల నిర్వహణను పర్యవేక్షించే సాధికార బోర్డు ఉండాలని వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖను పంపినట్టు దశరధ రామిరెడ్డి తెలిపారు.