బిఎల్ సంతోష్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చడం కొట్టివేత

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్  సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిలను నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది. 
మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌‌తో పాటు తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్‌‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మెమోపై నిందితుల తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్ లేదని వాదించారు. శ్రీనివాస్ తరఫు లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. మెమోను న్యాయమూర్తి కొట్టివేశారు. మెమో తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఏసీబీ చూపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు దర్యాప్తు చేయడానికి శాంతిభద్రతలకు కానీ, సిట్‌కు కానీ ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
కేవలం ఏసిబి మాత్రమే ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచించింది. శాంతి భద్రతలకు కానీ, సిట్ కు కానీ ఎటువంటి ప్రత్యేక  పోలీస్ వ్యవస్థ కాదు కాబట్టి వారికి ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. బీఎల్ సంతోష్‌‌తో పాటు తుషార్, న్యాయవాది శ్రీనివాస్‌‌లను నిందితులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.  ఇవే కారణాలు చూపుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది.
మరోవైపు ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సిట్ తరఫున వాదనలు వినిపించారు. నిందితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఉదయ్ హుల్ల వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు వాడివేడిగా కొనసాగాయి.
దవే వాదనలు వినిపిస్తూ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలను అస్థిరపరిచేలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసిందని వాదించారు. సీబీఐ చేత విచారణ కోరే అర్హత నిందితులకు లేదని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఉదయ్ హుల్లా వాదిస్తూ రాష్ట్ర సర్కారు పోలీసులను ఉపయోగించి చట్టవిరుద్ధంగా అరెస్ట్‌లు చేశారని కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో 41 ఎ సీఆర్‌పీసీ కింద విచారణ పేరుతో నోటీసులు జారీ చేసి బీజేపీ పార్టీ పెద్దల పేర్లు చెప్పమని వేధింపులు గురిచేస్తున్నట్టు నిందితుల తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.