`సుప్రీం’ చరిత్రలో మరోసారి మహిళా న్యాయమూర్తి బెంచ్‌

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ మహిళా న్యాయమూర్తులకు అరుదైన అవకాశం కల్పించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ఇద్దరు మహిళా న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కేవలం మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే.
న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బేల త్రివేదీల ధర్మాసనం కేసుల బదిలీకి సంబంధించిన కేసులతో పాటు మ్యాట్రిమోనియల్ కేసులను కూడా విచారిస్తుంది. ఇందులో వివాహ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ అంశాలు ఉన్నాయి. 

2013లో తొలిసారి జస్టిస్‌ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. అప్పటి ప్రిసైడింగ్‌ జడ్జి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 

ఆ తర్వాత 2018లో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. తాజాగా మరోసారి మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటైంది.  ప్రస్తుతం, సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లి, బేల త్రివేది, బివి నాగరత్న ఉన్నారు.

జస్టిస్ బి.వి, నాగరత్న 2027లో 36 రోజుల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసే అవకాశముంది. ఇక, సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులు అవసరం ఉండగా, ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు.  కాగా, 2020లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరేశ్వర్ ప్రతాప్ సాహి డివిజన్ బెంచ్ చేసిన సూచనకు సమాధానం ఇవ్వడానికి మొట్ట మొదటిసారిగా పూర్తిస్థాయి మహిళా బెంచ్‌ను (ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన) ఏర్పాటు చేశారు.