ఎ.ఎం.ఆర్. ఒక నిశ్శబ్ద, అదృశ్య మహమ్మారి!

“యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎం.ఎం.ఆర్.) అనేది నిశ్శబ్దంగా దెబ్బతీసే, అదృశ్య మహమ్మారి, ఇతర సాధారణ ప్రజారోగ్య ప్రాధాన్యతా కార్యక్రమాలతో దీన్ని అధిగమించడం సాధ్యం కాదు” అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. ఎం.ఎం.ఆర్. మహమ్మారి బెడదపై  జరిగిన 3వ అత్యున్నత స్థాయి ప్రపంచ సదస్సుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ప్లీనరీ ప్యానెల్ భేటీలో ఆమె ప్రసంగించారు.

ఒమన్‌లోని మస్కట్‌లో  జరిగిన  ఈ సదస్సులో 15కు పైగా దేశాలకు చెందిన 22 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ.ఎం.ఆర్.పై బహుళ భాగస్వామ్య వర్గాల ప్రమేయంతో కూడిన ఒక వేదికను నాలుగు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు ప్రారంభించాయి.  ఆరోగ్యానికి ప్రపంచస్థాయిలో ఎదురైన ముప్పుగా ఎ.ఎం.ఆర్.ను ఇప్పటికే గుర్తించినట్టు ఆమె చెప్పారు. ఎ.ఎం.ఆర్. మహమ్మారితో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఎ.ఎం.ఆర్. నిరోధంపై దృష్టి సారించినందుకు ఐక్యరాజ్యసమితి (యు.ఎన్.) సర్వప్రతినిధి సభకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.కు), సభ్యదేశాలకు కేంద్ర మంత్రి డాక్టర్ పవార్ అభినందనలు తెలిపారు. ఎ.ఎం.ఆర్. బెడద నిర్మూలనకు, సమస్య పరిష్కరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్టు ఆమె చెప్పారు.

2016లో ఎ.ఎం.ఆర్.పై ఒక సదస్సును భారతప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిందని చెప్పారు. ఆరోగ్యరక్షణకు చేపట్టిన జాతీయ ఎజెండాలో ఎ.ఎం.ఆర్. మహమ్మారిని ఎదుర్కొనే కార్యక్రమాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు.  అవగాహనా కల్పన, సామర్థ్యాల పెంపుదల, ప్రయోగశాలల బలోపేతం, నిఘా, వైరస్ వ్యాప్తి నిరోధం, నియంత్రణ, యాంటీమైక్రోబయల్ స్టీవార్డ్‌షిప్, కొత్త ఔషధాల రూపకల్పనపై పరిశోధనలు, వ్యాధినిర్ధారణ, ఆవిష్కరణల ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు.

ఎ.ఎం.ఆర్.పై న్యూఢిల్లీలో ప్రపంపస్థాయి సదస్సును ప్రారంభించిన ఊపుతోనే, 2024లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో జరగబోయే అత్యున్నత స్థాయి సమావేశాన్ని సమీకృతం చేయడానికి కృషిచేయాలని డాక్టర్ పవార్ సూచించారు. అన్ని స్థాయిలలో రాజకీయ మద్దతును బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.