అనాసక్తతో 9 లక్షల ఎకరాలలో నాట్లు వేయని  ఏపీ రైతులు 

ఈ ఏడాది వ్యవసాయానికి అన్నీ అనువుగా ఉన్నా రైతులలో నెలకొన్న అనాసక్తత కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల ఎకరాల్లో పంట వేయలేదు.  సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు ముగిసినట్లే. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు సీజన్‌ సమయం కాగా సాధారణ విస్తీర్ణంలో తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా సాగు కాలేదు. 
సాధారణ సాగులో పది శాతం విస్తీర్ణంలో సాగు లేక భూములు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది పంటల సాగు కాస్త ఆలస్యంగా మొదలైనందున అక్టోబర్‌లోనూ కొంత మేరకు సేద్యం జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అక్టోబర్‌ రెండోవారం వరకు వరి నాట్లు పడతాయని అంచనా వేస్తున్నారు.
ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా ఈ సంవత్సరం సీజన్‌ ప్రారంభం నుంచీ సాగు ముమ్మరంగా లేదు. సాగు ఖర్చులు పెరగడం, సంస్థాగత అప్పులు పుట్టకపోవడం, అన్నింటికీ మించి పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విపత్తు, తెగుళ్ల నష్టాల కారనంగా రైతులు నిరాశా నిస్పుహ్రలకు లోనై కొన్ని పంటల సేద్యంపై అనాసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.
ప్రభుత్వం ఈ ఏడాది 96.42 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్ణయించింది. సాధారణ సాగు విస్తీర్ణం 92.05 లక్షల ఎకరాలు. సెప్టెంబర్‌ నెలాఖరుతో సీజన్‌ ముగుస్తుండగా 82.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే 9.22 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం కంటే 13.62 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 
గతేడాది ఇదే సమయానికి సాధారణం కంటే 10 లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గింది. ఖరీఫ్‌ వేళకొచ్చే నైరుతి రుతుపవనాలు జూన్‌ 13న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి 20 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించాయి. అక్కడక్కడ డ్రైస్పెల్స్‌ ఉన్నప్పటికీ సీజన్‌ మొత్తమ్మీద సాధారణ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ 28 నాటికి నార్మల్‌ 556 మిల్లీమీటర్లు కాగా 563.2 మిమీ వర్షం పడింది.
రిజర్వాయర్లన్నింటిలో నీటి నిల్వలు ఆశాజనకంగానే ఉన్నాయి. భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు. అయితే ఇప్పటికి 105 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ప్రధానమైన ఆహార పంటల సాగు తగ్గింది. వరి, అపరాలు, చిరుధాన్యాలు, పప్పులు, నూనెగింజలు అన్నీ సాధారణంగా కంటే తక్కువ సాగయ్యాయి.
అపరాల్లో మొక్కజొన్న మాత్రం వంద శాతానికి పైన సాగైంది. వాణిజ్యపంటల్లో పత్తి నార్మల్‌ కంటే కొంచెం ఎక్కువ సాగైంది. మిరప సైతం స్వల్పంగా పెరిగింది. చెరకు, పొగాకు, ఇతర పప్పుధాన్యాలు తగ్గాయి.  ఇదిలా ఉండగా సాధారణంగా సీజన్‌ చివరిలో ప్రభుత్వం పంటల సాగు గణాంకాలను విడుదల చేసేది. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా పొడిపొడిగా సాగు వివరాలు వెల్లడించింది.