చైనా మొబైల్ షియోమి రూ.5,551 కోట్ల నిధులను సీజ్

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కింద ఆ కంపెనీకి చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్ చేసింది. ఇడి చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని జప్తు చేయడం ఇదే మొదటిసారి. 

ఫెమా చట్టం కింద ఈ మొత్తాన్ని గత ఏప్రిల్ 29నే ఇడి జప్తుచేసి కాంపిటేటివ్ అథారిటీ ఆమోదం కోసం పంపించగా, తాజాగా అథారిటీ ఆమోదం తెలిపింది. రాయల్టీ పేరుతో విదేశాలకు నిధులను మళ్లించడం ఫెమా నిబంధనల కింద తీవ్రమైన నేరమని ఇడి పేర్కొంది. 

ఎంఐ, షియోమి ఇండియాపేరుతో చైనాకు చెందిన షియోమి గ్రూపు భారత్‌లో గత కొన్నేళ్లుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే రూ.5,551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పని చేస్తున్న కంపెనీలకు షియోమి ఇండియా పంపించింది. 

2014లో ఈ సంస్థ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించగా 2015 నుంచి డబ్బులు పంపించడం ప్రారంభించింది. ఈ సొమ్మును షియోమి గ్రూపు సహా మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ కింద పంపించింది. షియోమీ పేరెంట్ గ్రూపు సంస్థల సూచనలతోనే రాయల్టీ పేరుతో ఇంతటి భారీ మొత్తాలను పంపించింది.

అంతేకాకుండా షియోమి గ్రూపు సంస్థల ప్రయోజనం కోసం అమెరికాకు చెందిన సంబంధం లేని రెండు సంస్థలకు కూడా డబ్బులు పంపినట్లు ఇడి గుర్తించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు వ్యతిరేకమే కాకుండా బ్యాంకలును తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు తరలించిందని ఇడి పేర్కొంది.

కాగా ఇడి చర్యను షియోమి కర్నాటక హైకోర్టులో సవాలు చేసింది. అయితే జులై 5న ఈ రిట్‌ను కొట్టివేసిన హైకోర్టు ఇడి వివాదానికి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీలో తేల్చుకోవాలని సూచించింది.