26 శాతం పెరిగిన జీఎస్టీ వ‌సూళ్లు

జీఎస్టీ వ‌సూళ్లు సెప్టెంబ‌ర్‌లో 26 శాతం పెరిగాయ‌ని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దాదాపు 1.47 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూల్ అయిన‌ట్లు తెలిపింది. గ‌డిచిన ఏడు నెల‌ల నుంచి జీఎస్టీ వ‌సూళ్లు వ‌రుస‌గా.. 1.40 ల‌క్ష‌ల కోట్లు దాటుతోంది. 
 
ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జీఎస్టీ మొత్తం వ‌సూళ్లు 1,47,686 కోట్లుగా ఉంద‌ని ఆర్థిక శాఖ తెలిపింది. దీంట్లో సెంట్ర‌ల్ జీఎస్టీ 25,271 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ 31,813 కోట్లుగా ఉంది. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 80,464 కోట్లు కాగా, సెస్ 10,137 కోట్లుగా ఉందని కేంద్ర‌ ఆర్థిక‌శాఖ పేర్కొంది. సెస్ కలెక్షన్లలో రూ.856 కోట్లు వస్తువుల దిగుమతులపై పన్ను విధింపు ద్వారా లభించాయి.

వస్తు, సేవల లావాదేవీలు ఒకటికి మించి రాష్ట్రాల మధ్య జరిగితే అది ఐజీఎస్టీ పరిధిలోకి వస్తుంది. వాటిని నిర్దిష్ట నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఖాతాల్లోకి మళ్లించాల్సి ఉంటుంది. ఐజీఎస్టీ ద్వారా వచ్చిన రూ.80,464 కోట్లలో రూ.31,880 కోట్లను కేంద్ర జీఎస్టీ ఖాతాలోకి, రూ.27,403 కోట్లను రాష్ట్ర జీఎస్టీ ఖాతాలోకి సర్దుబాటు చేశారు. 

ఈ సర్దుబాట్లన్నీ జరిగిన తర్వాత సెప్టెంబరు నెలలో కేంద్ర జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.57,151 కోట్లకు, రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.59,216 కోట్లకు చేరింది. గత ఏడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో  జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరిగాయి.

ఇదే వ్యవధిలో వస్తువుల దిగుమతులపై  వచ్చే జీఎస్టీ ఆదాయం 39 శాతం, సేవల దిగుమతులపై వచ్చే జీఎస్టీ ఆదాయం 22 శాతం మేర పెరిగింది. సెప్టెంబరు నెలలో 20వ తేదీన రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.49,453 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి.  ఆ రోజున ఏకంగా 8.77 లక్షల ఛాలాన్లను జీఎస్టీ కలెక్షన్ల కోసం జారీ చేశారు. ఇంతకుముందు ఈ ఏడాది జులై 20న 9.58 లక్షల ఛాలాన్లను జారీ చేసి దాదాపు రూ.57, 846 కోట్ల జీఎస్టీని కలెక్ట్ చేశారు.