బ్రిటన్ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతున్న హోరాహోరీ పోరులో భారత సంతతికి చెందిన రిషి సునక్ అనూహ్యంగా పుంజుకున్నారు. గురువారం జరిగిన కీలక చర్చల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మరో అభ్యర్థి లిజ్ ట్రస్పై రిషి విజయం సాధించారు. స్కై న్యూస్ నిర్వహించిన ‘బ్యాటిల్ ఫర్ నంబర్ 10’ టీవీ డిబేట్లో స్టూడియో ప్రేక్షకులు సునాక్కు మద్దతిచ్చారు.
ఇప్పటి వరకు రిషి వెనుకంజలో ఉండగా.. ఈ డిబేట్ తదుపరి ప్రధాన పదవి రేసులో కాస్త మెరుగయ్యారు. ఈ టివి డిబేట్లో ఇరువులు పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీ ప్రజెంటర్.. లిజ్ ట్రస్ను తన ప్రశ్నలతో కొంత ఇరకాటంలో పడేశారు. ఇటీవల ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి ట్రస్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల జీతాలను తగ్గిస్తే ప్రభుత్వానికి 8.8 బిలియన్ యూరోలు ఆదా అవుతాయని ఆమె తెలిపారు.
అయితే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ ప్రకటనపై ఆమె యూటర్న్ తీసుకున్నారు. తాజాగా జరిగిన టీవీ డిబేట్లో ప్రజెంటర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రస్పై ప్రశ్నలు కురిపించారు. ఉద్యోగుల జీతాలపై మీరు మీకు ప్రకటనను వెనక్కి తీసుకున్నారని ప్రజెంటర్ అనగా తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్రస్ ఆరోపించారు.
దీనికి ప్రజెంటర్ స్పందిస్తూ ‘మంచి నేతలు తమ తప్పులను ఒప్పుకొంటారా లేదా ఇతరులను నిందిస్తారా?’ అని ప్రశ్నించారు. తాను ఎవరినీ నిందించడం లేదని.. కొంతమంది వ్యక్తులు తన ప్రకటనను తప్పుదోవ పట్టించారంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు.
తాము ప్రధాని పదవికి ఎందుకు అర్హులమో ఇరువురు అభ్యర్థులు వివరణనిచ్చారు. ఈ సందర్భంగా రిషి సునక్ మాట్లాడుతూ ‘పన్నుల తగ్గింపు కంటే ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్ రేట్లు పెరుగుతాయి. మన సేవింగ్స్, పింఛన్లు అన్నీ ఆవిరవుతాయి” అని పేర్కొన్నారు.
అనంతరం లిజ్ ట్రస్ మాట్లాడుతూ అధిక పన్నుల వల్లే బ్రిటన్లో మాంద్యం భయాలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రస్ వాదనను రిషి తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం వల్లే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ఇరువురి వాదనలు పూర్తయిన తర్వాత స్టూడియోలోని ఆడియన్స్కు ఓటింగ్ పెట్టారు. ఇందులో ఎక్కువ మంది రిషి సునాక్కు మద్దతుగా ఓటువేశారు. దీంతో ఆయన విజయం సాధించినట్లు ప్రకటించారు.
More Stories
పాక్ కు మిస్సైల్ టెక్నాలజీ ఇచ్చిన చైనా కంపెనీలపై ఆంక్షలు
రష్యన్ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసిన యుక్రెయిన్
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు