డ్రాగన్ హెచ్చరికలు బేఖాతరు.. తైవాన్ లో అడుగుపెట్టిన నాన్సీ 

చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో మంగళవారం రాత్రి తైవాన్ లో అడుగుపెట్టారు.  తైవాన్‌లో పెలోసి పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించినా  ఆమె తైవాన్‌ పర్యటనకు రావడంతో రెండు అగ్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

రెండు రోజుల క్రితం పెలోసి ఆసియా దేశాల పర్యటన ఖరారైనపుడు తైవాన్‌ ఊసు లేకపోవడంతో అమెరికా వెనక్కి తగ్గిందని భావించారు. కానీ అనూహ్యంగా మంగళవారం రాత్రి పెలోసి తైపేలో కాలు పెట్టారు. పెలోసి ప్రయాణిస్తున్న విమానానికి తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

తన భూభాగంగా చైనా చెప్పుకొంటున్న తైవాన్‌లో అమెరికాకు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి పర్యటించడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దానితో అమెరికా, చైనా, టైవాన్ లు తమ సేనలను మోహరించడంతో యుద్ధ మేఘాలు అలముకొంటున్నాయి.

అమెరికా వైమానికదళానికి చెందిన విమానంలో తైపే చేరుకున్న పెలోసికి తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వూ తైపే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. `ఈ పర్యటన అమెరికాకు గౌరవప్రదం,’ అని పెలోసి వ్యాఖ్యానించారు. తైవాన్‌ ప్రజాస్వామ్యానికి తమ పూర్తి మద్దతు వుంటుందని ఆమె స్పష్టం చేశారు.

కాగా చైనా పట్ల అమెరికా విధానానికి, తైవాన్‌లో తన పర్యటనకు సంబంధమేమీ లేదని పెలోసి పేర్కొన్నారు. ఈ పర్యటన అమెరికా విధానంతో ఏ విధంగానూ విభేదించదని ఆమె తేల్చి చెప్పారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవలసి వస్తోన్న ప్రస్తుత తరుణంలో తైవాన్‌లోని 23 మిలియన్ల ప్రజలకు అమెరికా సంఘీభావం ఇప్పుడు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

 పెలోసి తైపీ పర్యటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా తేల్చి చెప్పడంతో చైనా సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి దాటినట్లుగా స్థానికంగా వార్తలు వెలువడుతునన్నాయి. పెలోసి తైవాన్ పర్యటనపై చైనా మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా అమెరికా – చైనాల మధ్యతలు నెలకొనడంతో  చైనాకు చెందిన ఎస్‌యు35 యుద్ధ విమానాలు తైవాన్ స్ట్రెయిట్ దాటి వెళ్లినట్లు సిజిటిఎస్ పేర్కొంది. మరో వైపు చైనా హెచ్చరికల నేపథ్యంలో నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో అమెరికా మోహరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పెలోసి తైవాన్ పర్యటనకు ప్రతిగా సైనిక చర్యలు చేపడతామని చైనా హెచ్చరించింది. పెలోసి పర్యటిస్తూ వుంటే చైనా చూస్తూ ఊరుకోదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి స్పష్టం చేశారు. అమెరికా తాజా చర్య నేపథ్యంలో, చైనా తన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కచ్చితంగా తీసుకుంటుందని వెల్లడించారు. తలెత్తే పర్యవసానాలకు అమెరికానే బాద్యురాలని తేల్చి చెప్పారు.

చైనా-అమెరికా మధ్య కుదిరిన మూడు ఒప్పందాల్లోని నిబంధనలన్నింటినీ ఈ పర్యటన అతిక్రమించిందని పేర్కొంటూ  తైవాన్‌ను తమ అంతర్భాగంగా చైనా పరిగణిస్తోందని చెప్పారు