ప్రపంచ ఐటీబీటీ, స్టార్టప్ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరంలో రానున్న రోజుల్లో విమానాల తయారీ కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భరోసా వ్యక్తం చేశారు. దేవనహళ్లిలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సఫ్రాన్ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏరోస్పేస్ సాంకేతిక రంగంలో బెంగళూరు శరవేగంగా దూసుకెళుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ ప్రక్రియ 65 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాకారమైందని చెప్పారు. ఇదే దిశలో మొత్తం విమానాల ఉత్పత్తి బెంగళూరుతోపాటు కర్ణాటకలో రానున్న రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు.
ఈ దిశలో హెచ్ఏఎల్, ఎన్ఏఎల్, డీఆర్డీఓ వంటి సంస్థలు నిరంతర ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కర్ణాటకలో ఇథనాల్ ఉత్పాదన అనే అంశంపై నగరంలో ఏర్పాటైన మరో సదస్సులో సీఎం బొమ్మై ప్రసంగీస్తూ రానున్న రోజుల్లో అత్యధిక ఇథనాల్ ఉత్పాదనా కేంద్రంగా కర్ణాటకకు చోటు దక్కడం ఖాయమని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో 32 చక్కెర కర్మాగారాలు ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో 60 చక్కెర కర్మాగారాలు ఇథనాల్ ఉత్పత్తి కోసం ఎదురు చూస్తున్నాయని బొమ్మై వెల్లడించాయిరు. ఏడాదిన్నర అవధిలో ఇథనాల్ ఉత్పత్తి మరో 20 శాతం పెరగడం ఖాయమని తెలిపారు. చెరుకుతోపాటు వరి, జొన్న, గోధుమల పొట్టుతో కూడా ఇథనాల్ తయారీకి సంబంధించి పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. ఇంధన ఉత్పాదన రంగంలో స్వయం సమృద్ధికి ఇలాంటి పరిశోధనలు బాగా దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

More Stories
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల