జీ యాంకర్ కు రాహుల్ గాంధీ ఫేక్ న్యూస్‌పై అరెస్ట్ నుండి రక్షణ

జీ యాంకర్ కు రాహుల్ గాంధీ ఫేక్ న్యూస్‌పై అరెస్ట్ నుండి రక్షణ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించి రూపొందించిన క్లిప్‌పై పోలీసు కేసులలో జీన్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ను ఇప్పుడే అరెస్టు చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. తనను అరెస్టు చేయడానికి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ పోలీసులు యత్నిస్తుండడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని కోరారు. 

సర్వోన్నత న్యాయస్థానం అతడి పిటిషన్‌పై అటార్నీ జనరల్ కార్యాలయం ద్వారా కేంద్రానికి నోటీసు జారీ చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను, తన ప్రోగ్రామ్‌లో భాగస్థులుగా ఉన్న ఉద్యోగులను రక్షణ కోరుతూ ఆయన పిటిషన్ పెట్టుకున్నారు.

కేరళలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారు కుర్రకుంకలని రాహుల్ గాంధీ అన్నట్లు ఆయన తన వీడియోలో చూపించారు. కానీ ఆయనకు ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ చంపివేతపై ఆయన ఛానల్ వ్యాఖ్యానాలు చేసింది. 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీస్ బృందం ఒకటి అతడిని అరెస్టు చేయడానికి మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఘాజీయాబాద్‌కు చేరుకుంది. ఆయన ఇంటి ముందు రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు వాదులాడు కోవడంతో చివరికి నోయిడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి అతడిని బెయిల్‌పై వదిలిపెట్టారు. 

ఆ తర్వాత అతడి రాష్ట్రంలో మకాం వేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అతను దొరకలేదు. అతని కార్యాలయానికి కూడా ఆ పోలీసు బృందం వెళ్లింది. కాగా నోయిడా, ఘాజియాబాద్ పోలీసులకు వ్యతిరేకంగా న్యాయపరమైన మార్గాలను ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెతుకుతున్నారు.